విశాఖపట్నంలో (Visakhapatnam) గల్లంతైన మత్స్యకారుల (Fishermen) పట్ల ప్రభుత్వం (Government) వ్యవహరించిన తీరుపై ఇప్పటికే రాజకీయంగా చర్చ జరుగుతున్న వేళ, ఇప్పుడు పలాసలో మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు (Seediri Appalaraju) అరెస్టు మరోసారి అదే వర్గంలో అసంతృప్తికి కారణమైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వరుస పరిణామాలతో మత్స్యకారుల పట్ల కూటమి ప్రభుత్వం (Coalition Government) వివక్ష చూపుతోందా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
విశాఖ ఘటనతోనే మత్స్యకార సామాజిక వర్గంలో కూటమికి నష్టం జరిగే పరిస్థితి ఏర్పడిందని టీడీపీ(TDP) వర్గాల్లోనే చర్చ నడుస్తున్న సమయంలో, పలాసలో అదే వర్గానికి చెందిన సీదిరి అప్పలరాజు అరెస్టు కావడం రాజకీయంగా మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ చర్య మత్స్యకారులలో ప్రభుత్వంపై మరింత అనుమానాలు పెంచిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఉప్పాడ మత్స్యకారుల సమస్యలను (Uppada Fishermen Problems) 100 రోజుల్లో పరిష్కరిస్తానని ఇచ్చిన హామీకి ఇప్పటికే పది నెలలు దాటిపోయినా పురోగతి కనిపించలేదని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. మరోవైపు మత్స్యకారులకు అందే పలు సంక్షేమ పథకాలలో కోతలు విధించడంతో అసంతృప్తి మరింత పెరిగిందని వారు ఆరోపిస్తున్నారు. తమకు పథకాలు ఎందుకు నిలిపివేశారో వెల్లడించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో జాయింట్ డైరెక్టర్ కార్యాలయాన్ని (Joint Director Office) మత్స్యకారులు ముట్టడించిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.
ఇలా వరుసగా మత్స్యకారులకు సంబంధించిన అంశాల్లో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఉత్తరాంధ్రతో పాటు గోదావరి జిల్లాల్లో కూడా ప్రతికూల భావన పెరుగుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిణామాలు రానున్న ఎన్నికల్లో రాజకీయ ప్రభావం చూపే అవకాశముందని వారు అంచనా వేస్తున్నారు. మత్స్యకారులను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పేందుకు ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయని, సరైన సమయంలో ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిర్ణయం వెల్లడిస్తామని ఆ సామాజిక వర్గానికి చెందిన పలువురు నాయకులు హెచ్చరిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.







