సోషల్ మీడియా వేదికలపై డీప్ఫేక్లు(Deepfakes), మార్ఫింగ్ చేసిన ఫొటోలు(Morphed Photos, ప్రచార కంటెంట్, తప్పుడు సమాచారం, ఇతర అక్రమ కంటెంట్ (Illegal Content) వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Government) చర్యలను మరింత వేగవంతం చేసింది. ఇందులో భాగంగా మెటా (Meta) తన ఆల్గారిథమ్ను (Algorithm) మరోసారి పరిశీలించి, కంటెంట్ నియంత్రణకు సంబంధించి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
వివాదాస్పద పోస్టులపై చర్చ
కేంద్ర ప్రభుత్వ అధికారులు, మెటా సాంకేతిక బృందం మధ్య శుక్రవారం జరిగిన కీలక సమావేశంలో ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. డీప్ఫేక్లు, మార్ఫింగ్ చేసిన చిత్రాలు, తప్పుడు పోస్టులు, ప్రచార కంటెంట్ వేగంగా వ్యాప్తి చెందకుండా ఆల్గారిథమ్లో అవసరమైన మార్పులు చేయాలని అధికారులు సూచించినట్లు సమాచారం.
అదే సమయంలో కంటెంట్ నియంత్రణ వ్యవస్థను (Content Moderation System) మరింత కఠినతరం చేయాలని కేంద్రం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల నుంచి తొలగింపు అభ్యర్థనలు వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా స్పందించి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వివాదాస్పద పోస్టులను వెంటనే తొలగించాలని సూచించినట్లు సమాచారం.
భారతీయ డేటా స్థానికీకరణ నిబంధనలను (Indian Data Localization Rules) కూడా కచ్చితంగా పాటించాలని కేంద్రం మెటాకు స్పష్టం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సమావేశంలో ఆన్లైన్లో హానికరమైన కంటెంట్ను తమ ప్రస్తుత వ్యవస్థలు ఏ విధంగా గుర్తిస్తున్నాయి, వాటిని ఎలా నియంత్రిస్తున్నాయనే అంశాలను మెటా సాంకేతిక బృందం అధికారులకు వివరించినట్లు తెలుస్తోంది.
ఈ దేశ చట్టాలు పాటించాల్సిందే
ప్రస్తుత వ్యవస్థల్లో కొన్ని లోపాలు ఉన్న విషయాన్ని మెటా అంగీకరించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. డీప్ఫేక్లు, ఇతర కృత్రిమంగా రూపొందించిన కంటెంట్ను గుర్తించి నియంత్రించేందుకు తీసుకోగల సాంకేతిక చర్యలపై కూడా మెటా బృందం వివరించినట్లు సమాచారం.
ఈ అంశంపై ఇరుపక్షాలు మరింత చర్చలు కొనసాగించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. వచ్చే వారం మరోసారి సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అన్ని సోషల్ మీడియా వేదికలు దేశ చట్టాలను తప్పనిసరిగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసినట్లు సమాచారం. వినియోగదారుల భద్రతతో పాటు సమాజం పట్ల కూడా ఆయా సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.







