తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు 73 ఏళ్ల వయసులో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు.
కృష్ణా జిల్లా కురుమద్దాలి గ్రామంలో జన్మించిన జీవీ నారాయణరావు మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో నటనలో శిక్షణ పొందారు. సినీ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత ప్రముఖ నటులు రజనీకాంత్, చిరంజీవితో ఆయనకు సన్నిహిత అనుబంధం ఏర్పడింది.
1976లో ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ తెరకెక్కించిన ‘అంతులేని కథ’ చిత్రంతో జీవీ నారాయణరావు వెండితెరపైకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ‘ముత్యాల పల్లకి’, ‘అంగడి బొమ్మ’, ‘చిలకమ్మ చెప్పింది’, ‘గ్యాంగ్ లీడర్’, ‘హిట్లర్’ తదితర చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
సినిమాలతో పాటు బుల్లితెరపైనా జీవీ నారాయణరావు ప్రేక్షకులను అలరించారు. పలు ప్రముఖ టెలివిజన్ ధారావాహికల్లో నటిస్తూ తనదైన ముద్ర వేశారు. నటుడిగా కొనసాగుతూనే నిర్మాతగానూ రాణించిన ఆయన పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.
- దేవాంతకుడు
- ఇంటికో రుద్రమ్మ
- యముడికి మొగుడు
- పెళ్లి నీకు శుభం నాకు
వంటి చిత్రాలను నిర్మించి నిర్మాతగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. నటుడిగా, నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమకు సేవలందించిన జీవీ నారాయణరావు ఇక లేరనే వార్తతో సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.







