ఆస్ట్రేలియా అండర్-19 జట్టు భారత్ పర్యటనకు రానున్న నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి అండర్-19 జట్లను ప్రకటించింది. ఆస్ట్రేలియాతో జరగనున్న 3 వన్డేలు, 2 బహుళ రోజుల మ్యాచ్ల కోసం వేర్వేరు జట్లను ఎంపిక చేసింది. ఈ జట్లలో మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులు ఆర్యవీర్ సెహ్వాగ్, అన్వయ్ ద్రవిడ్కు చోటు దక్కింది.
3 వన్డేల కోసం లక్ష్య రాయ్చందానీ కెప్టెన్గా, యశబర్ధన్ చౌహాన్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యారు. బహుళ రోజుల మ్యాచ్లకు యశబర్ధన్ చౌహాన్ కెప్టెన్గా, లక్ష్య రాయ్చందానీ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు.
సెహ్వాగ్ వారసుడికి తొలిసారి టీమిండియా పిలుపు
వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ తొలిసారి భారత అండర్-19 జట్టులో చోటు సంపాదించాడు. సెప్టెంబర్లో రాజ్కోట్ వేదికగా జరిగే 3 వన్డేల సిరీస్లో అతడు బరిలోకి దిగనున్నాడు. కుడిచేతి వాటం బ్యాటర్ అయిన ఆర్యవీర్ ఇటీవల ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో వెస్ట్ ఢిల్లీ లయన్స్ తరఫున ఆడాడు.
2024 కూచ్ బెహార్ ట్రోఫీలో మేఘాలయపై ఏకంగా 297 పరుగులు చేసి సత్తా చాటిన ఆర్యవీర్.. దేశవాళీ క్రికెట్లో నిలకడైన ప్రదర్శనతో ఇప్పుడు భారత జట్టులోకి వచ్చాడు.
ద్రవిడ్ కుమారుడికి మరోసారి అవకాశం
రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్ కూడా వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. వికెట్ కీపర్-బ్యాటర్ అయిన అన్వయ్.. జూలైలో శ్రీలంక పర్యటనలో భారత అండర్-19 జట్టు తరఫున 87 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ ప్రదర్శనతో మరోసారి జట్టులో చోటు సంపాదించాడు.
అయితే ఆర్యవీర్, అన్వయ్ ఇద్దరికీ బహుళ రోజుల జట్టులో చోటు దక్కలేదు. దీంతో వీరిద్దరూ వన్డే సిరీస్లో మాత్రమే కనిపించనున్నారు.
ఆస్ట్రేలియా సిరీస్కు తేదీలు ఖరారు
భారత్, ఆస్ట్రేలియా అండర్-19 జట్ల మధ్య 3 వన్డేలు, 2 బహుళ రోజుల మ్యాచ్లు జరగనున్నాయి.
వన్డేలు:
సెప్టెంబర్ 18 – తొలి వన్డే, రాజ్కోట్
సెప్టెంబర్ 21 – రెండో వన్డే, రాజ్కోట్
సెప్టెంబర్ 23 – మూడో వన్డే, రాజ్కోట్
బహుళ రోజుల మ్యాచ్లు:
సెప్టెంబర్ 27-30 – తొలి మ్యాచ్, రాజ్కోట్
అక్టోబర్ 5-8 – రెండో మ్యాచ్, అహ్మదాబాద్ బీ గ్రౌండ్
భారత అండర్-19 వన్డే జట్టు:
లక్ష్య రాయ్చందానీ కెప్టెన్, యశబర్ధన్ చౌహాన్ వైస్ కెప్టెన్, రజత్ బఘేల్, ఆర్యవీర్ సెహ్వాగ్, వీకే వినీత్, కుశాగ్ర ఓజా, అర్జున్ రాజ్పుత్, మనాల్ చౌహాన్, అన్వయ్ ద్రవిడ్, వి. యశ్వీర్, రోహిత్ యాదవ్, షావిన్ వినోద్, మోహిత్ ఉల్వా, చిగురుపతి వెంకట, కావ్యా పటేల్.
భారత అండర్-19 బహుళ రోజుల జట్టు:
యశబర్ధన్ చౌహాన్ కెప్టెన్, లక్ష్య రాయ్చందానీ వైస్ కెప్టెన్, సాగర్ విర్క్, కుశాగ్ర ఓజా, మనాల్ చౌహాన్, కుశ్ పటేల్, మానవ్ కృష్ణ, అభిప్రాయ్ బిస్వాస్, రోహిత్ యాదవ్, ఈశాన్ ఓం, అయాన్ అక్రమ్, ప్రణవ్ రాఘవేంద్ర, ప్రియాన్షు సింగ్, మోహిత్ ఉల్వా, ఆర్యన్ యాదవ్.








