విజయవాడ (Vijayawada)లో విద్యుత్ మీటర్ రీడర్ల (Electric Meter Readers) నిరసన ఉద్ధృతంగా కొనసాగుతోంది. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ (AITUC) ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది మీటర్ రీడర్లు ఒక్కటై ‘ఛలో విజయవాడ’ (Chalo Vijayawada) పిలుపుతో రాజధాని నగరానికి తరలివచ్చారు.
స్మార్ట్ మీటర్లతో ఉద్యోగ భద్రత కోల్పోతామన్న ఆందోళన
రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల (Smart Meters) ఏర్పాటు వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో తమ ఉపాధి పూర్తిగా ప్రమాదంలో పడుతుందంటూ మీటర్ రీడర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 10 నుంచి 20 ఏళ్లుగా తక్కువ వేతనాలతో విధులు నిర్వహిస్తున్న తమను ఇప్పుడు ఒక్కసారిగా పక్కన పెట్టడం అన్యాయమని వారు ఆరోపిస్తున్నారు. స్మార్ట్ మీటర్ల అమలుతో తమకు పని లేకుండా పోతుందన్న భయం వారిని రోడ్డెక్కించింది.
ప్రభుత్వ స్పందన లేకపోవడంతో ఉద్యమం ఉద్ధృతి
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,800 మంది మీటర్ రీడర్లు గత ఐదు రోజులుగా రిలే నిరాహార దీక్షలు నిర్వహించినా, కూటమి ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో నిరసన మరింత తీవ్రతరమైంది. ఎన్నికల ముంది జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు తమకి అండగా ఉంటామని హామీ ఇచ్చి నేడు కనీసం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ వీధుల్లో విద్యుత్ ఉద్యోగులు (Electricity Employees) పెద్ద సంఖ్యలో చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్
తమ అర్హతలు, అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని విద్యుత్ శాఖలోనే షిఫ్ట్ ఆపరేటర్లు, లైన్మెన్ లేదా ఇతర విభాగాల్లో ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించాలని మీటర్ రీడర్లు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగ భద్రత కల్పించకపోతే ఆందోళనను రాష్ట్రవ్యాప్తంగా మరింత విస్తరిస్తామని యూనియన్ నాయకులు హెచ్చరిస్తున్నారు.






