తూర్పు చైనాలోని (China) ఫుజియాన్ ప్రావిన్స్లో (Fujian Province) ఘోర అగ్నిప్రమాదం (Fire Accident) విషాదాన్ని మిగిల్చింది. జింజియాంగ్ నగరంలోని (Jinjiang City) హుయిటెంగ్ షూస్ ఫ్యాక్టరీలో (Huiteng Shoes Factory) గురువారం మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే ఫ్యాక్టరీ అంతటా మంటలు వ్యాపించడంతో 28 మంది కార్మికులు (Workers) సజీవదహనమైనట్లు అధికారులు వెల్లడించారు. మరికొందరు కార్మికులు భవనం లోపలే చిక్కుకుపోవడంతో పరిస్థితి మరింత విషమంగా మారింది.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే 35 ఫైర్ ఇంజిన్లు, 183 మంది అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భారీ ప్రాణనష్టం జరగడంపై చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (Xi Jinping) తీవ్ర విచారం వ్యక్తం చేయడంతో పాటు ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
చైనా ప్రభుత్వ టెలివిజన్ (China State Television) విడుదల చేసిన దృశ్యాల్లో ఫ్యాక్టరీ భవనం లోపలి నుంచి దట్టమైన నల్లటి పొగలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది వాటర్ హోస్లతో (Water Hoses) మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తుండగా, ప్రాణాలు కాపాడుకునేందుకు కార్మికులు కిటికీలు, భవనం పైకప్పు వైపు పరుగులు తీసిన దృశ్యాలు హృదయవిదారకంగా కనిపించాయి.
చైనాలో ఇటీవల వరుస అగ్నిప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో హాంకాంగ్లోని బహుళ అంతస్తుల భవనాల్లో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 168 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశాన్ని కుదిపేసింది. ఆ తర్వాత ఎత్తైన భవనాల్లో అగ్నిప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక చర్యలు ప్రారంభించినప్పటికీ, గతేడాది గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లోని ఓ నివాస భవనంలో జరిగిన ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. ఇప్పుడు ఫుజియాన్లో చోటుచేసుకున్న ఈ తాజా ప్రమాదం మరోసారి చైనాలో భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.







