దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లోని జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద గురువారం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఉపాధ్యాయులు భారీ స్థాయిలో నిరసన చేపట్టారు. 2010కి ముందు నియమితులైన ఉపాధ్యాయులకు కూడా టెట్ (Teacher Eligibility Test) తప్పనిసరి చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఈ ధర్నా జరిగింది. ఏఐఎస్టీఎఫ్ (AISTF), ఏఐ జాక్టో (AIJACTO) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వేలాది మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఢిల్లీకి చేరుకున్నారు.
టెట్ విధానం ఉపాధ్యాయులకు అన్యాయం
ధర్నాలో పాల్గొన్న నేతలు మాట్లాడుతూ, 20 నుంచి 25 ఏళ్లుగా నిరంతరం సేవలందిస్తున్న ఉపాధ్యాయులను మళ్లీ టెట్ రాయమనడం తీవ్రమైన అన్యాయమని పేర్కొన్నారు. విద్యా హక్కు చట్టాన్ని సవరించి ఈ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను (CPS) రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (OPS) అమలు చేయాలని కోరారు. జాతీయ విద్యా విధానం పేరుతో తెలుగు మీడియాన్ని బలహీనపరిచే చర్యలు తీసుకోవద్దని హెచ్చరించారు. పాఠశాలల క్రమబద్ధీకరణ పేరుతో ఉపాధ్యాయ పోస్టులను తగ్గించే ప్రయత్నాలను తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేశారు. ఈ నిరసనకు పలు జాతీయ ఉపాధ్యాయ సంఘాలు సంఘీభావం ప్రకటించాయి.






