శ్రీ సత్యసాయి జిల్లాలో పోలీసులపై మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ (Most Wanted Criminal) కత్తితో దాడి చేసిన ఘటన తీవ్ర ఉత్కంఠను రేకెత్తించింది. పలు కేసుల్లో నిందితుడైన కావిడి నాగేంద్ర (Kavidi Nagendra) చిలమత్తూరు మండలం ఎర్రకొండ అటవీ ప్రాంతంలో ఉన్నాడనే సమాచారంతో పోలీసులు తెల్లవారుజామున గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో నాగేంద్ర అకస్మాత్తుగా పోలీసులపై తిరగబడి తన వద్ద ఉన్న కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో హిందూపురం (Hindupuram) అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ రవి తీవ్రంగా గాయపడ్డారు.
అదే సమయంలో ఆపరేషన్కు నాయకత్వం వహించిన రూరల్ అప్గ్రేడ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులుపై కూడా నిందితుడు కత్తితో దాడి చేయడంతో ఆయనకు గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరు పోలీసు సిబ్బందిని వెంటనే హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని పోలీసులు తెలిపారు.
నిందితుడు అదుపులోకి రాకుండా దాడులు కొనసాగించడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. దీంతో పోలీసులు స్వీయరక్షణార్థం కాల్పులు జరిపినట్లు సమాచారం. అనంతరం నాగేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన అత్త–కోడలు గ్యాంగ్ రేప్ కేసులో నాగేంద్ర ప్రధాన నిందితుడిగా ఉండటంతో పాటు, రెండు రాష్ట్రాల్లో కలిపి అతనిపై 90కి పైగా కేసులు నమోదై ఉన్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.






