ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra Pradesh High Court)లో మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) వరుసగా ఏడు క్వాష్ పిటిషన్లు (Quash Petitions) దాఖలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. తనపై వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
పట్టాభిపురం, నగరం పాలెం, మంగళగిరి, నల్లపాడు పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసులపై క్వాష్ పిటిషన్లు దాఖలయ్యాయి. నల్లపాడు పోలీస్ స్టేషన్ కేసుకు సంబంధించిన పిటిషన్ విచారణను ఈ నెల 11వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.
మంగళగిరి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో BNSS 35(3) ప్రక్రియను తప్పనిసరిగా పాటించాలని హైకోర్టు పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇదే కేసులో అంబటి రాంబాబుపై పిటి వారెంట్ పొందేందుకు పోలీసులు కోర్టును ఆశ్రయించినట్టు సమాచారం.
మిగిలిన ఐదు కేసులకు సంబంధించిన పిటిషన్లు వచ్చే సోమవారం విచారణకు వచ్చే అవకాశముందని న్యాయ వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారంలో హైకోర్టు తీసుకునే నిర్ణయం రాజకీయంగా కీలకంగా మారనుంది.






