తిరుమల లడ్డూ వ్యవహారంపై సీబీఐ నివేదిక వెలువడిన అనంతరం తెలుగుదేశం పార్టీతో పాటు దాని అనుబంధ మీడియా రక్షణాత్మక ధోరణిలోకి వెళ్లిందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. శ్రీవారి ప్రసాదంపై జంతు కొవ్వు, రసాయనాలు, పామ్ ఆయిల్, బాత్రూం క్లీనర్ వంటి విభిన్న ఆరోపణలు వరుసగా ప్రచారంలోకి రావడం వల్ల ప్రజల్లో తీవ్ర అసహనం ఏర్పడినట్లు కనిపిస్తోంది. భక్తులు పవిత్రంగా స్వీకరించే ప్రసాదంపై ఈ తరహా నిందలు అనుచితమన్న భావన సామాన్యుల్లో బలపడింది.
ఈ ప్రతికూలత నుంచి బయటపడే ప్రయత్నంలో కూటమిలోని తెలుగుదేశం, జనసేన పార్టీలు రాజకీయ దృష్టిని మళ్లించే యత్నం చేశాయని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో వైసీపీ మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు, గృహదహన ఘటనలు చోటుచేసుకోవడం రాజకీయ ఉద్రిక్తతకు దారి తీసింది. దాడులకు గురైన జోగి రమేష్ నివాసానికి పరామర్శకు వెళ్లిన మాజీ మంత్రి రోజా–జోగి రమేష్ల మధ్య జరిగిన సంభాషణలోని ఒక భాగాన్ని కత్తిరించి, రోజా లడ్డూ కల్తీని అంగీకరించారని తప్పుడు ప్రచారం ప్రారంభమైంది. ఈ కథనానికి బలం చేకూర్చేలా డిబేట్లు నిర్వహిస్తూ అనుబంధ మీడియా కూడా ప్రచారాన్ని ఉద్ధృతం చేసింది.
అయితే, వైసీపీ పూర్తి వీడియోను విడుదల చేయడంతో అసలు సంభాషణ స్పష్టమై, ఎడిటింగ్ ద్వారా చేసిన అసత్య ప్రచారం ఒక్కసారిగా బట్టబయలైంది. రోజా వ్యాఖ్యలను వక్రీకరించి నేరారోపణలుగా మలిచారని టీడీపీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఫలితంగా, ఈ వ్యవహారం మరోసారి తెలుగుదేశం పార్టీకి మరియు దాని అనుబంధ మీడియాకు రాజకీయంగా ఎదురుదెబ్బగా మారినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






