పోలవరం జిల్లా (Polavaram District) రంపచోడవరం నియోజవర్గంలోని మారేడిమిల్లి మండలం దేవరపల్లి ఆశ్రమ పాఠశాలలో (Devarapalli Ashram School) ఫుడ్ పాయిజనింగ్ (Food Poisoning) ఘటన చోటుచేసుకుని 91 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై రంపచోడవరం ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే, రంపచోడవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) ఇంచార్జ్ నాగులపల్లి ధనలక్ష్మి (Nagulapalli Dhanalakshmi) గారు ఆసుపత్రిని సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని పరామర్శించారు. అనంతరం దేవరపల్లి ఆశ్రమ పాఠశాలను పరిశీలించి, రంపచోడవరం ఐటీడీఏ పీవో గారితో పరిస్థితులపై చర్చించారు.
ఈ సందర్భంగా ధనలక్ష్మి గారు మాట్లాడుతూ, ఏరియా హాస్పిటల్లో ఒక్కో మంచంపై ఏడు నుంచి ఎనిమిది మంది విద్యార్థులను ఉంచాల్సిన దయనీయ పరిస్థితి నెలకొందని, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కనీస భద్రత కూడా లేకుండా పోయిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు, పదేపదే జరుగుతున్న మరణాలు సంభవిస్తున్న ఘటనల్లో అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయని, అయినా సంబంధిత శాఖలు చలనం లేకుండా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.
అలాగే హాస్టల్ సిబ్బంది విద్యార్థుల పట్ల కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని, విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు చూసుకునేందుకు అవసరమైన ఆణంలు అందుబాటులో ఉండటం లేదని ఆరోపించారు. ఈ పరిస్థితులకు తక్షణమే ముగింపు పలికి, గిరిజన విద్యార్థుల భద్రత, ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె డిమాండ్ చేశారు.







