తెలంగాణ (Telangana) రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) (Forensic Science Laboratory – FSL) అగ్ని ప్రమాదంపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు (Vote for Note Case)కు సంబంధించిన ఆధారాలు పూర్తిగా భద్రంగానే ఉన్నాయని ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్, టిజిసిఎస్బి డిజిపి శిఖా గోయెల్ (Shikha Goel) స్పష్టం చేశారు.
ఆమె మీడియాతో మాట్లాడుతూ, అగ్ని ప్రమాదం కేవలం మొదటి అంతస్తులోని కంప్యూటర్ సైన్స్ ల్యాబ్కే పరిమితమైందని, పై అంతస్తుల్లోని ఇతర విభాగాలకు ఎలాంటి నష్టం జరగలేదని వివరించారు. దగ్ధమైన గదిలో ఉన్న ఆధారాల్లో ఎక్కువ భాగాన్ని సురక్షితంగా వెలికితీశామని తెలిపారు.
2015లో ఎసిబి నమోదు చేసిన ఓటుకు నోటు కేసుకు సంబంధించిన 16 ఆధారాల విశ్లేషణ 2021లో పూర్తై కోర్టుకు సమర్పించామని ఈ కేసుతో పాటు మిగిలిన కేసుల్లో మిగిలిన కొన్ని ఆధారాలు కూడా సురక్షితంగానే ఉన్నాయని స్పష్టం చేశారు. ఇది ఇలా ఉంటే ఈ అగ్ని ప్రమాధంపై బీఆరెస్ పార్టీ నేతలు పలు అనుమానాలు వ్యక్తపరచడం విదితమే.








