ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) హైకోర్టు (High Court)లో మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu)కు తాత్కాలిక ఊరట లభించింది. పట్టాభిపురం, నగరం పాలెం పోలీస్ స్టేషన్లలో నమోదు చేసిన కేసులను క్వాష్ చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ (Petition)పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా భారతీయ నాగరిక సురక్షా సంహితలోని సెక్షన్ 35(3)ను తప్పనిసరిగా అనుసరించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.
ఏడేళ్లలోపు శిక్ష పడే నేరాల విషయంలో నిందితుడిని నేరుగా అరెస్టు చేయకుండా, విచారణకు హాజరుకావాలంటూ నోటీసు జారీ చేయాలని, నిందితుడు సహకరిస్తే అరెస్టు అవసరం లేదని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాల మేరకు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు అంబటి రాంబాబు కేసులో కీలక మలుపుగా మారాయి.







