వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై (Ambati Rambabu) నమోదైన 35 క్వాష్ పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణను ప్రారంభించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu)పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 35 కేసులు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది.
ఈ కేసులను రద్దు చేయాలంటూ అంబటి రాంబాబు హైకోర్టు (High Court)ను ఆశ్రయించగా, విచారణ సందర్భంగా కోర్టు కీలక ప్రశ్నలు లేవనెత్తింది. ఒకే అంశంపై 35 FIRలు ఎలా నమోదు చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. అంబటి రాంబాబు తరఫు న్యాయవాది, ఇదే విషయంపై అనేక కేసులు నమోదు చేయడం అన్యాయమని వాదించారు.
దీనిపై స్పందించిన ప్రభుత్వ న్యాయవాది, వేర్వేరు ప్రాంతాల నుంచి ఫిర్యాదులు అందిన కారణంగానే ఈ కేసులు నమోదయ్యాయని కోర్టుకు వివరించారు. ఈ అంశాన్ని పరిశీలిస్తున్న హైకోర్టు, BNSS 35(3) ప్రక్రియను తప్పనిసరిగా పాటించాలని పోలీసులకు సూచించింది. తుది తీర్పు వచ్చే వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను ఏపీ హైకోర్టు మార్చి 2వ తేదీకి వాయిదా వేసింది.







