రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం (Coalition Government) స్కామ్ల మయంగా మారిందని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ (YS Jagan Mohan Reddy) తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. ఎక్కడికక్కడ యథేచ్ఛగా దోపిడీ జరుగుతోందని, ప్రజల ఆస్తులు కొందరి ప్రయోజనాలకు బలవుతున్నాయని ఆయన విమర్శించారు. ముఖ్యంగా రూ.5 వేల కోట్ల విలువైన 54 ఎకరాల భూమిని గీతమ్ విశ్వవిద్యాలయానికి (GITAM University) కేటాయించడం పెద్ద వివాదాస్పద నిర్ణయమని పేర్కొన్నారు. ఏ ముఖ్యమంత్రి తన సొంత బంధువులకు ఈ విధంగా భూములు కేటాయించలేదని ఆయన ఆక్షేపించారు.
ఇప్పటి ప్రభుత్వంలో కొత్త నినాదంగా ‘క్యాష్.. సూట్కేసు.. రాజేష్.. లోకేష్’ అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయని, అవి ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయని జగన్ వ్యాఖ్యానించారు. ఈ అంశాలన్నింటిపై శాసన మండలిలో బలంగా గొంతు వినిపించాలని, ప్రజా ప్రయోజనాల కోసం విశ్రాంతి లేకుండా పోరాడాలని తన పార్టీ మండలి సభ్యులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
అలాగే చిత్తశుద్ధితో కష్టపడి పనిచేయాలని, సమయం వేగంగా గడుస్తుందని గుర్తుచేశారు. “కళ్లు మూసి తెరిచేలోపు మూడేళ్లు గడిచిపోతాయి. తిరిగి వచ్చే ప్రభుత్వం మనదే” అని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నిబద్ధతతో పని చేసే వారందరికీ భవిష్యత్తులో తగిన గుర్తింపు ఉంటుందని, పనితీరు ఆధారంగా పదవులు తిరిగి దక్కే అవకాశం మాత్రమే కాకుండా మరింత ఉన్నత స్థానాలు కూడా లభిస్తాయని వైయస్ జగన్ స్పష్టం చేశారు.






