జల ప్రయోజనాల విషయానికి వస్తే తనకు తెలంగాణే మొదటి ప్రాధాన్యత అని, ఆ తర్వాతే పార్టీ, వ్యక్తిగత అంశాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తాను ఎవరో చెప్పినట్లు మాట్లాడే వ్యక్తిని కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలతో తెలంగాణ ప్రాజెక్టులకు నీరు చేరుతున్నా ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. వర్షాకాలంలోనే సాగునీరు అందక అన్నదాతలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎస్ఆర్ఎస్పీ కాల్వల పరిధిలో సాగునీటి ప్రాధాన్యత తెలిసిన వారికే ప్రస్తుత పరిస్థితి అర్థమవుతుందని ఈటల అన్నారు. తాను హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎస్ఆర్ఎస్పీ నీటిని విడుదల చేసి రైతులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకున్నానని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, ఆత్మగౌరవం కోసం సాగిందని, రాజకీయాలు మారినా ఉద్యమ లక్ష్యాలను మరవొద్దని సూచించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు ముందే వైఎస్సార్ హయాంలో జలయజ్ఞం కింద ప్రణహిత జలాల ప్రణాళిక రూపొందిందని, 24 టీఎంసీల సామర్థ్యంతో శ్రీపాద ఎల్లంపల్లి, మిడ్ మానేరు వంటి ప్రాజెక్టులకు అప్పుడే శ్రీకారం చుట్టారని తెలిపారు. తర్వాత కాళేశ్వరం అనుసంధానంతో మిడ్ మానేరు, పోచంపాడు నీటితో హుజూరాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో 2 పంటలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో కమీషన్లు, డిజైన్ల మార్పులపై తాను మాట్లాడటం లేదని, కానీ మొత్తం ప్రాజెక్టునే తప్పుబట్టడం అన్యాయమని కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు. దెబ్బతిన్న నిర్మాణాలను వెంటనే మరమ్మతు చేయకుండా ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తోందని ప్రశ్నిస్తూ, కరువు ముప్పు తెలిసినా నిర్లక్ష్యం చేయడం సరికాదని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.







