ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో (Kasturba Gandhi Balika Vidyalaya – KGBV) సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. హాస్టల్లో నివసిస్తున్న 11 నుంచి 12 మంది విద్యార్థులను (Students) ఎలుకలు కరిచినట్టు సమాచారం బయటపడటంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ హాస్టళ్ల (Welfare Hostels) నిర్వహణలో తీవ్రమైన నిర్లక్ష్యం ఉందా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
ఈ విషయం తెలిసిన వెంటనే వైఎస్సార్సీపీ (YSRCP) రాష్ట్ర నాయకులు హాస్టల్ను సందర్శించి బాధిత విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, తగిన వైద్యసహాయం అందించాలని అధికారులను కోరారు. పార్టీ కార్యకర్తలు కూడా సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
“ఇదేనా సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ?” అంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. పిల్లల భద్రతకు హామీ ఇవ్వాల్సిన విద్యాసంస్థల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గత టీడీపీ(TDP) పాలనలో కూడా గుంటూరులో ఆసుపత్రిలో ఎలుక (Rat) కరిచి శిశువు మృతి చెందిన ఘటన పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. అదేవిధంగా ఇటీవల ఏలూరులో కూడా ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయి.
ప్రభుత్వ నిర్లక్ష్యమేనా? లేక హాస్టళ్లలో పర్యవేక్షణ లోపమా? విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందా అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






