తెలుగు సినీ పరిశ్రమలో ‘సోగ్గాడు’గా చిరస్థాయిగా గుర్తింపు పొందిన దివంగత నటుడు శోభన్బాబు సతీమణి శాంతకుమారి గురువారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 96 ఏళ్ల శాంతకుమారి గత కొంతకాలంగా వయోధిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో 4 రోజుల క్రితం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో శాంతకుమారిని పరామర్శించేందుకు ఆమె ఆప్తమిత్రురాలు ఒకరు వచ్చారు. ఇద్దరూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకుంటున్న వేళ అకస్మాత్తుగా శాంతకుమారికి గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
నేడు చెన్నైలో అంత్యక్రియలు
శాంతకుమారి పార్థివ దేహాన్ని చెన్నైలోని స్వగృహానికి తరలించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితులు తుది నివాళులు అర్పించిన అనంతరం శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆమె మృతి వార్తతో కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
సినీ ప్రముఖుల సంతాపం
తెలుగు చిత్రసీమలో క్రమశిక్షణ, కుటుంబ విలువలకు ప్రతీకగా నిలిచిన శోభన్బాబు-శాంతకుమారి దంపతులకు 1 కుమారుడు, 3 కుమార్తెలు ఉన్నారు. శాంతకుమారి మరణవార్త తెలిసిన వెంటనే టాలీవుడ్కు చెందిన పలువురు నటీనటులు, నిర్మాతలు, దర్శకులు ఆమెకు నివాళులు అర్పిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.






