ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర అసెంబ్లీలో (Assembly) అప్పుల అంశం మరోసారి తీవ్ర చర్చకు దారి తీసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా అప్పులు (Debts) చేస్తున్నదన్న విమర్శలు ప్రతిపక్షాలు, ప్రజలు మరియు రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా ఆ ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేసింది.
ఆర్థిక మంత్రి (Finance Minister) పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) మాట్లాడుతూ, గత ప్రభుత్వం 9.74 లక్షల కోట్ల రూపాయల అప్పులు మిగిల్చి వెళ్లిందని, వాటిని నిర్వహించాల్సిన అవసరం కారణంగా ప్రస్తుత ప్రభుత్వం కూడా అప్పులు చేయాల్సి వస్తోందని వివరించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారి తీశాయి.
అయితే, గత అసెంబ్లీ సమావేశాల్లో 2025 మార్చి 7న ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక మంత్రి లిఖితపూర్వకంగా ఇచ్చిన వివరాలు భిన్న చిత్రాన్ని చూపించాయి. ఆ సమాధానంలో, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఐదేళ్ల పాలనలో చేసిన మొత్తం అప్పులు రూ.3,39,580 కోట్లేనని స్పష్టం చేశారు. అందులో పబ్లిక్ డెబ్ రూ.2,34,225 కోట్లు కాగా, కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పులు రూ.1,05,355 కోట్లుగా పేర్కొన్నారు.
ఈ రెండు వాఖ్యాల మధ్య వ్యత్యాసం రాజకీయ వేదికలపై సందేహాలకు తావిస్తోంది. అప్పుల గణాంకాల్లో సెషన్కు సెషన్ మార్పులు చోటుచేసుకోవడం ప్రజల్లో అనుమానాలను కలిగిస్తోంది. ప్రభుత్వం ప్రకటిస్తున్న లెక్కలు ఏవీ? గతంలో ఇచ్చిన లిఖిత సమాధానమా? లేక ప్రస్తుత వేదికపై వెల్లడించిన గణాంకాలా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
అప్పుల అంశంలో స్పష్టత, పారదర్శకత మరియు స్థిరమైన గణాంకాల ప్రదర్శన అత్యంత అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. లేకపోతే ప్రభుత్వ విశ్వసనీయత దెబ్బతినే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.






