ఏపీ (Andhra Pradesh)లో మళ్లీ రికార్డింగ్ డ్యాన్సుల (Recording Dances) వివాదం చెలరేగింది. ఇటీవల సంక్రాంతి వేళ గ్రామాలు, పట్టణాల్లో రాజకీయ నేతల అండతో నిర్వహించిన రికార్డింగ్ డ్యాన్సుల కార్యక్రమాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఒక పాఠశాలలో విద్యార్థుల (School Students) ముందే ఫేర్వెల్ సందర్భంగా రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేయడంతో పెద్ద దుమారం రేగింది. ఆ ఘటనపై నారా లోకేష్ స్పందించి వార్డెన్ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
శివరాత్రి వేడుకల్లో కొత్త వివాదం
ఇప్పుడు మహాశివరాత్రి (Maha Shivaratri) సందర్భంగా సామర్లకోటలో నిర్వహించిన వేడుకలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. అక్కడ రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేయడమే కాకుండా, సమీపంలో ఉన్న మహాత్మా గాంధీ (Mahatma Gandhi) విగ్రహానికి ముసుగు కట్టి కార్యక్రమం జరిపినట్టు వీడియోలు వెలుగులోకి వచ్చాయి.
వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భక్తులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ నాయకుడి విగ్రహాన్ని కప్పి కార్యక్రమం నిర్వహించడం అవమానకరమని నెటిజన్లు మండిపడుతున్నారు. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి.






