కోటప్పకొండ (Kotappakonda) వద్ద వైసీపీ పార్టీకి చెందిన ప్రభ తగలబడిందని సోషల్ మీడియాలో ప్రచారం జరగడం భక్తుల్లో కలకలం రేపింది. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా (Palnadu District) పోలీసులు (Police) అధికారిక ప్రకటన విడుదల చేసి, దేవస్థానం ప్రాంగణంలో ఎలాంటి ప్రభ తగలబడిన ఘటన జరగలేదని స్పష్టం చేశారు. కొంతమంది కావాలనే పాత వీడియోలను సోషల్ మీడియాలో పంచుతూ అపోహలు సృష్టిస్తున్నారని అధికారులు గుర్తించారు.
లడ్డూ విషయంలో అపచారం జరిగిందని, అందువల్లే వైసీపీ ప్రభ తగలబడిందని రాజకీయ పోస్టులు పెట్టి ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. భక్తులు నిరాధార వార్తలను నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించారు. ప్రస్తుతం కోటప్పకొండ వద్ద అన్ని కార్యక్రమాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
పోలీసుల ప్రకటనతో అధికార పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు వ్యాప్తి చేస్తున్న వదంతులకు చెక్ పడినట్టైంది. లడ్డూ కల్తీ అంశంలో ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్రలో భాగంగా టీడీపీ(TDP) అనైతిక రాజకీయాలకు పాల్పడుతోందని వైసీపీ(YSRCP) ఆరోపించింది. దేవుళ్లు, మత విశ్వాసాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం తెలుగుదేశం (Telugu Desam Party), జనసేన పార్టీలు (Jana Sena Party) మానుకోవాలని వారు హితవు పలికారు.






