ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్లో ప్రపంచ దేశాధినేతలు, సాంకేతిక రంగ దిగ్గజాలు పాల్గొని భారత్ డిజిటల్ విప్లవ దిశగా వేగంగా పయనిస్తున్నదని ప్రశంసించారు. ఈ సందర్భంగా సుందర్ పిచాయ్ మాట్లాడుతూ, ప్రతి సారి భారత్కి వచ్చినప్పుడు అభివృద్ధి వేగం చూసి ఆశ్చర్యపోతున్నానని పేర్కొన్నారు. విద్యార్థి దశలో ఐఐటీ ఖరగ్పూర్ లో చదువుతున్నప్పుడు విశాఖపట్నం మీదుగా ప్రయాణించేవాడినని, ఇప్పుడు అదే విశాఖ తీరంలో గూగుల్ ఫుల్ స్టాక్ ఏఐ హబ్ ఏర్పాటు కావడం గర్వకారణమని తెలిపారు.
విశాఖపట్నంలో ప్రత్యేకంగా నిర్మించనున్న డేటా సెంటర్ క్యాంపస్ గిగావాట్ స్థాయి కంప్యూటింగ్ సామర్థ్యాన్ని అందించనుంది. ఇది భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిజిటల్ సేవల డిమాండ్ను తీర్చడంలో కీలక పాత్ర పోషించనుంది. ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఆదాని, భారతీ ఏయిర్టల్ ఉన్నట్లు గూగుల్ ఇప్పటికే వెల్లడించింది.
అంతేకాకుండా, విశాఖలో అంతర్జాతీయ సబ్-సి కేబుల్ ల్యాండింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి, ప్రపంచవ్యాప్తంగా రెండు మిలియన్ మైళ్లకు పైగా ఉన్న భూభాగ మరియు సముద్ర కేబుల్ నెట్వర్క్తో అనుసంధానం చేయనున్నారు. దీని ద్వారా విశాఖపట్నం కేవలం భారతదేశానికే కాక ప్రపంచానికి ఏఐ మరియు కనెక్టివిటీ హబ్గా మారనున్నదని వెల్లడించారు.
అయితే ఈ ప్రాజెక్టు క్రెడిట్ విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర వాదోపవాదాలు నెలకొన్నాయి. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తమ ప్రభుత్వ కృషివల్లే గూగుల్ పెట్టుబడి సాధ్యమైందని గతంలో పేర్కొన్నారు. దీనికి ప్రతిస్పందనగా ప్రతిపక్ష నేత జగన్ గారు 2023 మే 3న విశాఖలో డేటా సెంటర్కు శంకుస్థాపన చేశామని, 190 ఎకరాల భూమి కేటాయించినట్లు గుర్తుచేశారు.
అలాగే 2021 మార్చి 9న సింగపూర్ ప్రభుత్వానికి సముద్ర గర్భంలో 3,900 కిలోమీటర్ల సబ్-సీ కేబుల్ ఏర్పాటు విషయమై లేఖ రాసినట్లు పేర్కొంటూ ఆ పత్రాలను విడుదల చేశారు. 2022 అక్టోబర్ 11న అదానీ మరియు గూగుల్ మధ్య ఒప్పందం కుదిరిందని, నోయిడాలో డేటా సెంటర్ విస్తరణకు స్థలం లీజుకు తీసుకున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటు వెనుక అసలు కృషి ఎవరిదనేది ప్రజలకి అవగాహన రావడంతో పాటు, తెలుగుదేశం విధానాలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.






