అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారి తీసిన ఎప్స్టీన్ ఫైల్స్లో ప్రముఖ వ్యాపారవేత్త బిల్ గేట్స్ పేరు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదాల నడుమ ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ఆయన ప్రసంగానికి అనుమతి ఇవ్వకపోవడం దేశంలో చర్చనీయాంశమైంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అనేక మంది స్వాగతిస్తూ, సామాజిక మాధ్యమాల్లో అభినందనలు తెలిపారు.
ఈ పరిణామాల నేపథ్యంలో నటి పూనం కౌర్ సంచలన ట్వీట్ చేస్తూ రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశారు. జాతీయ స్థాయిలో మానవతా విలువలను కాపాడే దిశగా బాధ్యతాయుత నిర్ణయం తీసుకున్నందుకు ప్రధానమంత్రి మొడీ గారికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎందుకు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనాల్సి వచ్చిందని ఆమె ప్రశ్నించారు.
భవిష్యత్తులో తమ పిల్లల కోసం ఉత్తమ నాయకత్వాన్ని కోరుకునే ప్రజలు మంత్రి నారా లోకేష్ పై ఎందుకు విశ్వాసం ఉంచాలనే సందేహాన్ని వ్యక్తం చేశారు. యువ వయసులోనే మంత్రి పదవిని చేపట్టిన నాయకుడు ఇటువంటి వివాదాస్పద అంశాలపై స్పష్టమైన వైఖరి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వ తీరుపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎప్స్టీన్ ఫైల్స్ వివాదం ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఆ ఫైల్స్లో ఉన్న ఆరోపణలు తీవ్ర సంచలనం రేపగా, దేశంలో అనేక వర్గాలు బిల్ గేట్స్ వ్యవహారశైలిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు ప్రత్యేక స్వాగతం పలకడం రాజకీయంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే.






