ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో తిరుమల అంశం మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న “ఏడు కొండలు – రెండు కొండలు” (Seven Hills – Two Hills) వివాదానికి సంబంధించి తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వైరల్ వీడియో రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఆ వీడియోలో నాడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు (Nara Chandrababu Naidu), 7 కొండలపై జారీ చేసిన జీఓలను(GOs) రద్దు చేస్తామని ప్రకటించినట్లు చూపించడంతో చర్చలు మళ్లీ వేడెక్కాయి.
2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైయస్ రాజశేఖర రెడ్డి (Y. S. Rajasekhara Reddy) గారి హయాంలో తిరుమల (Tirumala) ప్రాంత పవిత్రతను కాపాడేందుకు 2005 సెప్టెంబర్ 26న జీఓ నం. 338 జారీ చేయబడింది. ఈ జీఓ ప్రకారం 10⅓ చదరపు మైళ్ల (సుమారు 27.5 చ.కి.మీ) పరిధిలోని ఆలయాలు, యాత్రికుల వసతులు, నివాస ప్రాంతాలను రాజకీయ కార్యకలాపాలకు నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు. ఈ నిర్ణయం చారిత్రక ఆధారాలపైనే తీసుకున్నదని ప్రభుత్వ రికార్డులు సూచిస్తున్నాయి.
1870లో బ్రిటీష్ పాలనలో 10⅓ చదరపు మైళ్ల విస్తీర్ణం తిరుమల తిరుపతి దేవస్థానాలకు అప్పగించబడగా, 1924లో ప్రభుత్వం దీనిని ధృవీకరించింది. 1965 జీఓ నం.1784, 1975 జీఓ నం.1605ల ద్వారా సరిహద్దులు నిర్ధారించబడ్డాయి. 1990 జీఓ నం.311 ప్రకారం ఈ భూమి పూర్తిగా టీటీడీ ప్రత్యేక అధీన ఆస్తిగా గుర్తించబడింది. అలాగే 1986లో నందమూరి తారక రామారావు గారి నియమించిన జస్టిస్ చల్లా కొండయ్య కమిటీ కూడా ఇదే పరిమితిని స్పష్టం చేసింది.

అయితే, జీఓ 338ను వక్రీకరించి “వైయస్సార్ తిరుమల ఏడు కొండలను రెండు కొండలుగా మార్చారని” ఆరోపణలు గుప్పిచ్చారు. దీనిపై స్పష్టతనిచ్చేందుకు 2007 జూన్ 2న జీఓ నం.746 జారీ చేసి ఏడు కొండలూ తిరుమల పవిత్ర పరిధిలో భాగమేనని అధికారికంగా పేర్కొన్నారు. అదే సమయంలో జీఓ నం.747 ద్వారా దేవాలయాల పరిసర ప్రాంతాల్లో అన్యమత ప్రచారాలను నిషేధించారు.

ఈ నేపథ్యంలో 2009లో గుంటూరులో జరిగిన సమావేశంలో జీఓ నం.746,747లను రద్దు చేస్తామని చంద్రబాబు గారు చేసిన ప్రకటన వీడియో బయటకు రావడం రాజకీయ వాతావరణాన్ని మళ్లీ కుదిపేసింది. ఈ వీడియోను విడుదల చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, రెండు దశాబ్దాలుగా సాగిన అసత్య ప్రచారానికి ఇది ముగింపు అని వ్యాఖ్యానిస్తోంది.
మొత్తంగా పరిశీలిస్తే, జీఓ 338 ఉద్దేశ్యం తిరుమల ప్రాంతాన్ని రాజకీయాల ప్రభావం నుంచి, పంచాయతీ ఎన్నికల నుండి దూరంగా ఉంచడమేనని స్పష్టమవుతోంది. అనంతరం జీఓ 746 ద్వారా ఏడు కొండల పవిత్రతను అధికారికంగా ధృవీకరించారు. అయినప్పటికీ, “ఈ 7 కొండల జీఓను రద్దు చేస్తాం” అన్న చంద్రబాబు వ్యాఖ్యలు వెలుగులోకి రావడం రాజకీయ విశ్లేషకుల్లో అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ పరిణామాలపై పవన్ కళ్యాణ్ సహా సంబంధిత నేతలు ఏమి స్పందిస్తారన్నది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.






