హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) (Hyderabad Cricket Association)లో పనిచేస్తున్న సిబ్బంది, ఉద్యోగుల ట్రేడ్ యూనియన్ (HCASE) నేటి నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నారు. పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనియన్ ప్రతినిధులు వెల్లడించారు. సిబ్బంది ప్రధానంగా పెండింగ్లో ఉన్న ఓవర్ టైమ్ (OT) బకాయిలు (Overtime Dues), గ్రౌండ్ సిబ్బందికి సంబంధించిన కన్వేయన్స్ అలవెన్సులు (Conveyance Allowances) వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా, హెచ్ఆర్ కన్సల్టెన్సీ నియామకానికి సంబంధించిన ప్రతిపాదనను తక్షణమే రద్దు చేయాలని వారు కోరుతున్నారు.
గతంలో మూడు నెలల పాటు జీతాలు లేకపోయినా సంస్థ కోసం అంకితభావంతో పనిచేశామని ఉద్యోగులు గుర్తుచేశారు. అయితే సమస్యల పరిష్కారం కోసం మేనేజ్మెంట్కు పలుమార్లు లేఖలు రాసినా స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా మెడికల్ రీయింబర్స్మెంట్లతో (Medical Reimbursements) పాటు అందరికీ క్యాష్లెస్ ఆరోగ్య బీమా (Cashless Health Insurance) కల్పించాలని యూనియన్ డిమాండ్ చేసింది.
ప్రస్తుతం అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నామని, ఇకపై ఓపిక నశించిందని సిబ్బంది భావోద్వేగంగా తెలిపారు. డిమాండ్లు నెరవేరే వరకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పనులను పూర్తిగా నిలిపివేస్తామని యూనియన్ స్పష్టం చేసింది. సమ్మె కారణంగా మ్యాచ్ల నిర్వహణకు అంతరాయం కలిగితే దానికి మేనేజ్మెంటే బాధ్యత వహించాలని హెచ్చరించింది.






