నటి, మెగా బ్రదర్ నాగబాబు కోడలు లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) సోషల్ మీడియాలో (Social Media) తనపై, తన కుటుంబ సభ్యులపై అవమానకర వ్యాఖ్యలు (Abusive Comments) చేస్తున్నారని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు ఆమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
లావణ్య త్రిపాఠి తెలిపిన వివరాల ప్రకారం, ‘పర్పుల్ క్రెయాన్00’ (Purple Crayon00) అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా (Instagram Account) ద్వారా తనపై, కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు, దూషణలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇవి తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది.
ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఐటీ యాక్ట్ సెక్షన్ 67తో పాటు బీఎన్ఎస్ఎస్ 78, 79 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, ఆ ఇన్స్టాగ్రామ్ ఖాతా నిర్వహిస్తున్న వ్యక్తిని గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు.






