తెలంగాణలో (Telangana) రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువవుతుండడంతో విద్యార్థుల (Students) ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర విద్యాశాఖ (State Education Department) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ (Government), ఎయిడెడ్ (Aided), ప్రైవేటు (Private) పాఠశాలల్లో త్వరలో ఒంటిపూట బడులు అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు
విద్యాశాఖ (Education Department) జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఈ నెల 15వ తేదీ నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఒంటిపూట బడులు (Half-Day Schools) నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మాత్రమే తరగతులు జరుగుతాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం 12:30 గంటలకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తారు.
అయితే పదో తరగతి పరీక్షా కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో పరీక్షలు జరిగే రోజుల్లో మాత్రం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలలు పని చేస్తాయని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు ప్రభుత్వం సూచించింది.






