---Advertisement---

ప్రపంచ ఆర్చరీ వరల్డ్ కప్‌లో భారత్‌కు గోల్డ్ మెడల్ సొంతం

April 12, 2026

---Advertisement---

మెక్సికోలోని (Mexico) ప్యూబ్లాలో (Puebla) జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్‌లో (Archery World Cup) భారత మహిళల కాంపౌండ్ జట్టు (India Woman’s Compound Team) అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని (Gold Medal) కైవసం చేసుకుంది. ఈ సీజన్‌లో భారత్‌కు లభించిన ఏకైక పతకమిదే కావడం విశేషం. ఉత్కంఠభరితమైన ఫైనల్‌లో అమెరికా జట్టును 233-232 తేడాతో ఓడించి గోల్డ్ సాధించింది.

చివరి రౌండ్‌లో అద్భుతం.. 6 పర్ఫెక్ట్ షాట్స్‌తో విజయం

ఫైనల్ మ్యాచ్‌లో ఒక దశలో భారత్ 114-117, 173-174 స్కోర్లతో వెనుకబడి కనిపించింది. అయితే నిర్ణయాత్మకమైన చివరి సెట్‌లో భారత త్రయం అసాధారణ ప్రదర్శన చేసింది. వరుసగా 6 పర్ఫెక్ట్ బాణాలు సంధించి 60/60 స్కోర్ నమోదు చేస్తూ కేవలం 1 పాయింట్ తేడాతో అమెరికాను అధిగమించింది.

ఈ విజయంతో జ్యోతి సురేఖ (Jyothi Surekha Vennam) తన కెరీర్‌లో 12వ గోల్డ్ మెడల్‌ను సాధించి అరుదైన ఘనతను అందుకుంది. జట్టులో ప్రగతి, మధుర కూడా కీలక పాత్ర పోషించారు.

అయితే మహిళల కాంపౌండ్ విభాగంలో విజయాన్ని సాధించినప్పటికీ, మిగిలిన విభాగాల్లో భారత ప్రదర్శన నిరాశ కలిగించింది. రికర్వ్ విభాగం మరియు పురుషుల కాంపౌండ్ విభాగాల్లో భారత ఆర్చర్లు పతక స్థాయికి చేరుకోలేకపోయారు.

మాజీ ఒలింపియన్ తరుణ్‌దీప్ రాయ్, అతాను దాస్, ధీరజ్ బొమ్మదేవర, దీపికా కుమారి వంటి ప్రముఖులు కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయారు. వ్యక్తిగత విభాగాల్లో అతాను దాస్, ధీరజ్ ప్రీ-క్వార్టర్ ఫైనల్స్‌లోనే నిష్క్రమించగా, పురుషుల రికర్వ్ జట్టు తొలి రౌండ్‌లోనే ఓటమి పాలైంది.

మహిళల రికర్వ్ జట్టు క్వార్టర్ ఫైనల్స్ వరకు చేరినా టర్కీ చేతిలో ఓడిపోయింది. దీపికా కుమారి రెండో రౌండ్‌లోనే నిష్క్రమించగా, అంకిత భకత్, సిమ్రన్‌జీత్ కౌర్ మూడో రౌండ్ వరకు మాత్రమే ప్రస్థానం కొనసాగించారు.

మొత్తంగా మహిళల కాంపౌండ్ జట్టు గెలుపు భారత శిబిరానికి ఆనందాన్ని తీసుకువచ్చినా, రాబోయే పోటీల కోసం మిగిలిన విభాగాల్లో మరింత మెరుగుదల అవసరమని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment