అమెరికా(United States)–ఇరాన్ (Iran) మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమైన తర్వాత మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. పాకిస్తాన్ (Pakistan) రాజధాని ఇస్లామాబాద్లో (Islamabad) జరిగిన చర్చలు ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగియడంతో పరిస్థితి మళ్లీ క్లిష్టంగా మారింది. ఇదే సమయంలో హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) పరిణామాలు అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తున్నాయి.
మళ్లీ చర్చలకు సిద్ధమవుతున్న రెండు దేశాలు
రెండు దేశాల మధ్య రెండు వారాల కాల్పుల విరమణ గడువు ఏప్రిల్ 21 తో ముగియనుంది. ఈలోపే మళ్లీ చర్చలు ప్రారంభం కావచ్చని సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ తన డిమాండ్లపై కొంత సడలింపు చూపితే చర్చలకు సిద్ధమని అమెరికా వర్గాలు తెలియజేశాయి.
మొదటి విడత చర్చలు జరిగిన ఇస్లామాబాద్లోనే కొనసాగుతాయా లేదా స్విట్జర్లాండ్లోని(Switzerland) జెనీవాలో జరుగుతాయా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఇస్లామాబాద్లో జరిగిన దీర్ఘకాల చర్చల్లో కొన్ని అంశాల్లో పురోగతి కనిపించినప్పటికీ పూర్తి స్థాయి ఒప్పందం కుదరలేదు.
అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాల్గొనగా, ఇరాన్ తరఫున పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ గాలిబాఫ్ (Mohammad Ghalibaf) చర్చల్లో పాల్గొన్నారు. అణు కార్యక్రమాలు, ఆంక్షలు, హార్ముజ్ జలసంధి వంటి కీలక అంశాలపై రెండు దేశాల మధ్య ఇంకా విభేదాలు కొనసాగుతున్నాయి.






