గ్లోబల్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తన వ్యక్తిగత హక్కుల రక్షణ (Personal Rights Protection) కోసం న్యాయపోరాటానికి దిగారు. తన అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం తన పేరు, ఫోటోలు, వీడియోలు, వాయిస్ను ఎవరూ ఉపయోగించకూడదని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో (Delhi High Court) పిటిషన్ దాఖలు చేశారు.
సెలబ్రిటీల ప్రజాదరణను ఉపయోగించుకుని కొన్ని సంస్థలు వారి అనుమతి లేకుండానే ప్రకటనలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దీంతో వారి వ్యక్తిగత బ్రాండ్ విలువ (Brand Value) దెబ్బతినడమే కాకుండా, సంబంధం లేని అంశాల్లో కూడా వారి పేరు వినిపించే పరిస్థితి ఏర్పడుతోంది.
నేడు కోర్టులో విచారణ
అల్లు అర్జున్ దాఖలు చేసిన ఈ సివిల్ పిటిషన్పై జస్టిస్ తుషార్ రావు గెడెల (Tushar Rao Gedela) నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ చేపట్టనుంది. సామాజిక మాధ్యమాల్లో కృత్రిమ మేధస్సు సాయంతో వాయిస్ మార్చడం, అనుమతి లేకుండా ఫోటోలను మార్ఫింగ్ చేసి ప్రకటనలకు వినియోగించడం వంటి చర్యలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.
గతంలో పలువురు ప్రముఖ నటులు కూడా ఇలాంటి హక్కుల రక్షణ కోసం కోర్టులను ఆశ్రయించారు. ఇప్పుడు అల్లు అర్జున్ కేసుపై కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందనేది సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.






