కడప జిల్లాలో సంచలనం సృష్టించిన దస్తగిరి హత్య కేసు ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఈ ఘటన చుట్టూ మొదట నుంచే రాజకీయ ఆరోపణలు, ప్రతిఆరోపణలు వెల్లువెత్తగా, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఈ కేసును ప్రతిపక్షంపై మోపే ప్రయత్నం చేసిందనే విమర్శలు బలంగా వినిపించాయి. ఎన్నికల హామీల అమలు విషయంలో ఎదురైన విమర్శలను మళ్లించేందుకు ఈ ఘటనను ఉపయోగించుకున్నారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.
దస్తగిరి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి కడప రిమ్స్ ఆసుపత్రి దగ్గరలో హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను ఇరికించేందుకు ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా కడప మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డిపై ఆరోపణలు మోపుతూ ప్రచారం జరగడం వివాదాస్పదమైంది.
అయితే ఈ వ్యవహారంలో కీలక మలుపు దస్తగిరి భార్య స్టేట్మెంట్ తో వచ్చింది. మారెమ్మ జాతరలో డీజే సౌండ్స్ విషయంలో తలెత్తిన వివాదం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసిందని ఆమె వెల్లడించారు. తన కుమారుడిపై జరిగిన దాడి తర్వాత, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడిని చూడటానికి వెళ్లిన దస్తగిరిని ప్రత్యర్థి వర్గం దారుణంగా హత్య చేసినట్లు ఆమె వివరించడం సంచలనంగా మారింది.
ఇదే సమయంలో, ఈ కేసును రాజకీయంగా మలచేందుకు చేసిన ప్రయత్నాలు బయటపడుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రూ.100 కోట్ల విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారన్న ప్రచారాన్ని దస్తగిరి కుటుంబ సభ్యులు ఖండించడం, పోలీసులు ఇంట్లో ఉన్న పత్రాలన్నీ తీసుకెళ్లారని చెప్పడం కొత్త సందేహాలకు దారితీసింది. నిత్యానందరెడ్డితో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేయడం ద్వారా ఈ కేసుకు రాజకీయ రంగు పులమినట్టు కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మొత్తం మీద, దస్తగిరి హత్య కేసు కేవలం ఒక క్రిమినల్ ఘటనగా కాకుండా రాజకీయ ప్రచార యుద్ధంగా మారింది. తాజా పరిణామాలు ప్రజల్లో అవగాహన పెంచుతున్నాయి. నిజానిజాలు బయటపడుతున్న కొద్దీ, రాజకీయ ఆరోపణలపై ప్రజలు మరింత జాగ్రత్తగా స్పందిస్తున్నట్లు స్పష్టమవుతోంది. మొత్తానికి కూటమి ప్రభుత్వం మరోసారి ప్రజల్లో అబాసుపాలయిందనే అభిప్రాయం ఆయా వర్గాల నుండి వ్యక్తం అవుతుంది.






