బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. 2024లో జరిగిన హింసాత్మక నిరసనల తర్వాత భారత్లో ఆశ్రయం పొందిన ఆమె, 2026 డిసెంబర్లో స్వదేశానికి తిరిగి వెళ్లి కోర్టులో లొంగిపోతానని ప్రకటించారు. తనకు మరణశిక్ష అమలయ్యే అవకాశం ఉన్నా, ప్రాణాలకు ముప్పు ఉన్నా బంగ్లాదేశ్కు వెళ్లే నిర్ణయాన్ని మార్చుకోనని స్పష్టం చేశారు. రాయిటర్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
2024 ఆగస్టులో జరిగిన హింసాత్మక నిరసనల్లో పలువురు మరణాలకు, అణచివేత చర్యలకు బాధ్యురాలిగా షేక్ హసీనాను బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) దోషిగా తేల్చి మరణశిక్ష విధించింది. అయితే తనపై వచ్చిన అన్ని ఆరోపణలను ఆమె పూర్తిగా ఖండించారు. ఇదే సమయంలో ఆమెను భారత్ అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం పలుమార్లు కోరిన విషయం తెలిసిందే.
“నేను తిరిగి వెళ్తే నన్ను అరెస్ట్ చేయవచ్చు… నన్ను చంపేయవచ్చు… అయినా నేను నా దేశానికి వెళ్లాల్సిందే” అంటూ షేక్ హసీనా భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో తన పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్రమైన అణచివేతను ఎదుర్కొంటున్నారని ఆమె ఆరోపించారు. తాను మరణించాల్సి వచ్చినా, తన తల్లిదండ్రులు సమాధి అయిన, వారి రక్తం చిందిన సొంత నేలపైనే చివరి శ్వాస విడవాలని కోరుకుంటున్నానని చెప్పారు.
షేక్ హసీనాతో పాటు మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్ కూడా బంగ్లాదేశ్కు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. తనపై నమోదైన కేసులన్నీ రాజకీయ కక్షసాధింపులో భాగమని హసీనా ఆరోపించారు. కోర్టు విచారణ ప్రారంభమైన తర్వాత అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని, న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఆమె వెల్లడించారు.








