ఐపీఎల్(IPL) 2026లో భాగంగా ముల్లాన్పూర్ (Mullanpur) వేదికగా మరో హై వోల్టేజ్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. అజేయంగా దూసుకెళ్తున్న పంజాబ్ కింగ్స్(Punjab Kings), బలమైన రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) మధ్య జరుగుతున్న 40వ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్(Riyan Parag) ముందుగా బౌలింగ్(Bowling) ఎంచుకున్నాడు. దీంతో సొంత మైదానంలో పంజాబ్ కింగ్స్(Punjab Kings) తొలుత బ్యాటింగ్ (Batting) చేయనుంది.
ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్లలో 6 విజయాలు సాధించి, 13 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కోల్కతా నైట్ రైడర్స్తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో వారికి అదనంగా 1 పాయింట్ లభించింది.
మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కూడా మంచి ఫామ్లోనే ఉంది. ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడి 5 విజయాలు నమోదు చేసి, 3 మ్యాచ్ల్లో ఓటమి చవిచూసింది. ప్రస్తుతం 10 పాయింట్లతో పట్టికలో 4వ స్థానంలో ఉన్న రాజస్థాన్, ఈ మ్యాచ్లో గెలిచి ప్లేఆఫ్ అవకాశాలను మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది.
ముల్లాన్పూర్లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (Maharaja Yadavindra Singh International Cricket Stadium) పిచ్ సాధారణంగా బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు ఉండటంతో అభిమానులు రన్ ఫెస్ట్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ రెండు జట్ల మధ్య గత చరిత్రను పరిశీలిస్తే ఇప్పటివరకు ఐపీఎల్లో 30 సార్లు తలపడ్డాయి. అందులో రాజస్థాన్ రాయల్స్ 17 విజయాలు సాధించగా, పంజాబ్ కింగ్స్ 12 సార్లు గెలిచింది. 1 మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది.
ప్రస్తుత ఫామ్ను చూస్తే పంజాబ్ కింగ్స్ జోరును రాజస్థాన్ ఎలా అడ్డుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టాప్-4 రేసులో ఈ మ్యాచ్ ఫలితం కీలకంగా మారే అవకాశం ఉంది.






