---Advertisement---

నీట్ పేపర్ లీక్‌పై కేటీఆర్ ఫైర్.. “23 లక్షల విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటం!”

May 12, 2026

---Advertisement---

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ యూజీ (NEET UG) 2026 పేపర్ లీక్ వ్యవహారంపై మాజీ మంత్రి కేటీఆర్(K. T. Rama Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నాపత్రం లీక్ (Paper Leak) కారణంగా పరీక్షనే రద్దు చేయాల్సిన పరిస్థితి రావడం కేంద్ర ప్రభుత్వ(Central Government) వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. పగలు రాత్రి కష్టపడి చదివిన లక్షలాది మంది విద్యార్థుల (Students) భవిష్యత్తుతో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు.

తాజాగా ఎక్స్‌ వేదికగా స్పందించిన కేటీఆర్(KTR), 2024లో జరిగిన నీట్ పేపర్ లీక్ ఘటన నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని వ్యాఖ్యానించారు. అదే నిర్లక్ష్యం కారణంగా మరోసారి పరీక్షా వ్యవస్థపై మచ్చ పడిందన్నారు. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నిర్వహణలో వరుస తప్పిదాలు విద్యార్థులకు శాపంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.

పరీక్షకు ముందు రోజే 100కు పైగా ప్రశ్నలు లీక్ కావడం దేశంలోని పరీక్షా వ్యవస్థలో ఉన్న లోపాలను బహిర్గతం చేసిందన్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాయగా, ఇప్పుడు పరీక్ష రద్దుతో వారు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని పేర్కొన్నారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారని చెప్పారు.

ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకోవాలని కేటీఆర్(KTR) డిమాండ్ చేశారు. ఈ ఘటన వెనుక ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పూర్తి స్థాయి దర్యాప్తు నిర్వహించి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని కోరారు.

అలాగే, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత త్వరగా మళ్లీ నీట్ పరీక్షను అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర ప్రభుత్వం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

ఇదిలా ఉండగా, దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన మెడికల్ ప్రవేశ పరీక్షగా భావించే నీట్ యూజీ 2026 రద్దు కావడం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ‘గెస్ పేపర్’(Guess Paper) లీక్ అయ్యిందన్న ఆరోపణల నేపథ్యంలో మే 3న నిర్వహించిన పరీక్షను రద్దు చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది.

కేంద్ర దర్యాప్తు సంస్థలు సేకరించిన కీలక ఆధారాల ఆధారంగా పరీక్షా విధానం విశ్వసనీయత దెబ్బతినకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పరీక్షా వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పునరుద్ధరించేందుకు ఈ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది.

గెస్ పేపర్ బయటకు ఎలా వచ్చింది? దీని వెనుక ఎలాంటి ముఠా పనిచేసింది? అనే కోణాల్లో సీబీఐ సమగ్ర విచారణ చేపట్టనుంది. దర్యాప్తుకు అవసరమైన అన్ని రికార్డులు, డిజిటల్ డేటాను ఎన్టీఏ స్వయంగా సీబీఐకి అందించనున్నట్లు తెలుస్తోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment