భారత్లో (India) ఇప్పుడు ప్రకృతి విపత్తుల కంటే ఎక్కువ ప్రాణాలు తీస్తున్నది పిడుగులేనని తాజా గణాంకాలు చెబుతున్నాయి. రాత్రి వేళల్లో ఒక్కసారిగా ఉరుములు (Thunder), మెరుపులతో (Lightning Flashes) ఆకాశం చీలిపోతున్న దృశ్యాలు ఇప్పుడు సాధారణమైపోయాయి. పొలాల్లో పనిచేస్తున్న రైతులు (Farmers), బహిరంగ ప్రదేశాల్లో ఉన్న ప్రజలు క్షణాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకప్పుడు అరుదుగా కనిపించిన ఈ ప్రమాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా భయంకర రూపం దాల్చుతోంది.
ప్రతి రోజు సగటున 5 మంది భారతీయులు పిడుగుల కారణంగా చనిపోతున్నారు. గతంలో సంవత్సరానికి 1800 వరకు నమోదైన మరణాలు ఇప్పుడు 2800 నుంచి 3000 మధ్యకు చేరుకున్నాయి. 2022లో దేశవ్యాప్తంగా 2887 మంది పిడుగుల బారిన పడి మరణించగా, 2023లో 2560 మంది ప్రాణాలు కోల్పోయారు. 2024లో మళ్లీ 2825 మరణాలు నమోదయ్యాయి. 2025 సెప్టెంబర్ వరకు ఇప్పటికే 1456 మంది చనిపోయారు. ఇందులో ఉత్తరప్రదేశ్లోనే (Uttar Pradesh) 284 మంది మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. జార్ఖండ్లో 222 మంది, ఆంధ్రప్రదేశ్లో 192 మంది, బీహార్లో 146 మంది పిడుగుల కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
పిడుగుల తీవ్రత పెరగడానికి ప్రధాన కారణం వాతావరణ మార్పులేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి ఉష్ణోగ్రతలు పెరగడం, సముద్రాల వేడి అధికమవడం, ముఖ్యంగా బంగాళాఖాతంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల గాల్లో తేమ విపరీతంగా పెరుగుతోంది. వేడి గాలి పైకి ఎగరడం, చల్లని గాలి దాన్ని ఢీకొనడం వల్ల మేఘాల మధ్య భారీ విద్యుత్ ఘర్షణ ఏర్పడుతుంది. ఈ సమయంలో లక్షల కోట్ల వోల్టుల విద్యుత్ ఒక్కసారిగా భూమిపై పడటమే పిడుగు.
భూమి ఉష్ణోగ్రత ఒక్క డిగ్రీ పెరిగినా పిడుగుల తీవ్రత 10 నుంచి 12 శాతం వరకు పెరిగే అవకాశముందని పరిశోధనలు చెబుతున్నాయి. అడవుల నరికివేత, కాలుష్యం, నగరాల్లో పెరుగుతున్న వేడి కూడా పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మారుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో భారీ జనాభా ఉండటం, లక్షలాది మంది రైతులు బహిరంగ ప్రదేశాల్లో పనిచేయడం వల్ల ప్రమాదం మరింత పెరుగుతోంది. వర్షం మొదలైతే చెట్ల కింద నిలబడటం, పొలాల్లోనే ఉండిపోవడం కారణంగా ఎక్కువ మంది పిడుగులకు బలవుతున్నారు.
బీహార్ (Bihar), జార్ఖండ్ (Jharkhand) ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మాన్సూన్కు ముందు వచ్చే ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడ తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేకపోవడం కూడా మరణాలకు ప్రధాన కారణంగా మారుతోంది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పరిస్థితి కూడా ఆందోళనకరంగానే మారుతోంది. సముద్రానికి దగ్గరగా ఉండటం వల్ల కోస్తా జిల్లాల్లో తేమ ఎక్కువగా ఉంటుంది. అందుకే శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పిడుగుల ప్రభావం అధికంగా నమోదవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక లైట్నింగ్ అలర్ట్ సిస్టమ్స్ ఏర్పాటు చేస్తూ గ్రామాల్లో రియల్ టైమ్ హెచ్చరికలు ఇచ్చే యంత్రాలను అమర్చుతోంది.
తెలంగాణలో (Telangana) కూడా పిడుగుల ముప్పు పెరుగుతోంది. ఒక్కరోజులోనే 8 మంది వరకు మరణించిన ఘటనలు ఇటీవలి కాలంలో నమోదయ్యాయి. పొలాల్లో పనిచేస్తూ వర్షం నుంచి తప్పించుకునేందుకు చెట్ల కింద నిలబడటం, ఇనుప వస్తువుల దగ్గర ఉండటం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
ఇప్పటికే ఈ పిడుగుల ప్రభావం గ్రామాలకే పరిమితం కావడం లేదు. నగరాల్లో కూడా భారీ భవనాలు, ఎలక్ట్రిక్ టవర్లు, కాలుష్యం వంటి అంశాలు వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అందుకే శాస్త్రవేత్తలు పిడుగులను “సైలెంట్ కిల్లర్”(Silent Killer)గా అభివర్ణిస్తున్నారు. వరదలు వస్తే ముందే హెచ్చరికలు ఉంటాయి, తుఫాన్లు వస్తే సమాచారం అందుతుంది. కానీ పిడుగు మాత్రం ఒక్క క్షణంలో ప్రాణాన్ని తీసేస్తుంది.
అందుకే ఇప్పుడు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉరుములు వినిపించిన వెంటనే ఇంట్లోకి వెళ్లాలి. చెట్ల కింద నిలబడకూడదు. పొలాల్లో మొబైల్ ఫోన్లు, ఇనుప వస్తువులు ఉపయోగించకూడదు. ప్రభుత్వం విడుదల చేసే అలర్ట్ యాప్స్ను తప్పనిసరిగా ఉపయోగించాలి. చిన్న జాగ్రత్తే ఒక కుటుంబాన్ని కాపాడగలదని గుర్తుంచుకోవాలి.






