మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’(Peddi) విడుదలకు ముందే తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా విడుదల సందర్భంగా టికెట్ ధరల పెంపుతో (Ticket Price Hike) పాటు అదనపు షోలకు (Additional Shows) కూడా అనుమతి మంజూరు చేసింది. దీంతో అభిమానుల్లో సినిమా పై మరింత హైప్ నెలకొంది.
జూన్ 3 రాత్రి 8 గంటలకు ప్రత్యేక ప్రీమియర్ షో (Special Premiere Show) నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ప్రత్యేక షో కోసం ఒక్కో టికెట్ ధరను గరిష్ఠంగా రూ.600గా నిర్ణయించారు. విడుదలకు ముందే అభిమానులకు సినిమా చూసే అవకాశం లభించడంతో థియేటర్ల వద్ద భారీ క్రేజ్ కనిపిస్తోంది.
జూన్ 4 నుంచి సినిమా అధికారికంగా విడుదల కానుండగా, తొలి 10 రోజుల పాటు టికెట్ ధరలను పెంచుకునేందుకు థియేటర్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో (Single Screen Theatres) ఒక్కో టికెట్పై అదనంగా రూ.100 వరకు పెంచుకోవచ్చు. మల్టీప్లెక్స్ థియేటర్లలో (Multiplex Theatres) అయితే రూ.125 వరకు అదనంగా వసూలు చేసుకునే అవకాశం కల్పించారు.
సాధారణంగా రోజుకు 4 షోలు మాత్రమే ప్రదర్శించే థియేటర్లకు ఈసారి ప్రత్యేక మినహాయింపు ఇచ్చారు. ‘పెద్ది’ సినిమా కోసం రోజుకు 5 షోలు ప్రదర్శించేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో తొలి 10 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో షోలు ప్రదర్శించనున్నారు.
ఇప్పటికే ‘పెద్ది’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతులు రావడంతో సినిమా ఓపెనింగ్స్ మరింత భారీగా ఉండే అవకాశం కనిపిస్తోంది. మొదటి రోజు పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లు నమోదు చేసే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.






