2026 సంవత్సరం దేవరకొండ కుటుంబానికి(Deverakonda Family) ఎంతో ప్రత్యేకంగా మారుతోంది. విజయ్ దేవరకొండ తన చిరకాల ప్రేయసి రష్మిక మందన్నను (Rashmika Mandanna) వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించగా.. రష్మిక దేవరకొండ కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టింది. వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టిన ఈ జంట ఇప్పుడు సినీ కెరీర్పై దృష్టి సారిస్తోంది.
దేవరకొండ కుటుంబం నుంచి వరుస సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ముందుగా ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) సెప్టెంబర్ 11న ఎపిక్ (Epic) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. గం గం గణేషా తర్వాత ఆయన నటిస్తున్న ఈ చిత్రానికి 90స్ బయోపిక్ సిరీస్తో గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఆ తర్వాత అక్టోబర్ 16న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన రణబాలి (Ranabali) సినిమా విడుదల కానుంది. టాక్సీవాలా సినిమాతో గుర్తింపు పొందిన రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
విజయ్, రష్మిక గతంలో గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న దసరాపై మరింత ఆసక్తి నెలకొంది.
ఇక నవంబర్ 27న రష్మిక మందన్న(Rashmika Mandanna) మైసా (Maisa) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై ఆక్టేన్ యాక్షన్ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.
వివాహం తర్వాత దేవరకొండ కుటుంబం నుంచి వరుసగా సినిమాలు రావడంతో వీటి ఫలితాలపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా విజయ్, ఆనంద్ సినిమాలతో పాటు రష్మిక చిత్రాలు ఎలాంటి విజయాన్ని అందుకుంటాయో చూడాలి.








