నేపాల్లో భారీ వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. రసువా జిల్లాలో బుధవారం ఉదయం భోటేకోషి నది ఒక్కసారిగా ఉప్పొంగడంతో పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలు నీటమునిగాయి. భారీ వరద ప్రవాహానికి నదీ తీరంలోని ఇళ్లు, జనావాసాలు కొట్టుకుపోవడంతో పరిస్థితి భయానకంగా మారింది.
ఆకస్మిక వరదల కారణంగా రసువా జిల్లాలోని పలు ప్రాంతాలు, రహదారులు, మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. స్యాఫ్రూబెసి, బెట్రావతి, మైలుంగ్, సల్లెతార్, శాంతిబజార్, పైరేబెసి, ఖాల్తీ బస్తీ, సోలే, త్రిశూలి, బట్టార్ సహా 10కి పైగా గ్రామాలు ప్రభావితమయ్యాయి.
ప్రాణ, ఆస్తి నష్టంపై ప్రభుత్వం ఇంకా పూర్తి గణాంకాలు వెల్లడించలేదు. ఇప్పటివరకు 13 మృతదేహాలను వెలికితీయగా, 1,000 మందికి పైగా గల్లంతై ఉండొచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వరదల ప్రభావంతో 4,000 మందికి పైగా ప్రజలు తీవ్రంగా ప్రభావితమైనట్లు నేపాల్ ఆర్మీ తెలిపింది.
బాధితులను రక్షించేందుకు నేపాల్ ఆర్మీ, సాయుధ పోలీసు బలగాలు, నేపాల్ పోలీసులు రెస్క్యూ చర్యలు చేపడుతున్నారు. నేపాల్ ప్రభుత్వం 2 సైనిక హెలికాప్టర్లను రంగంలోకి దించింది. నేపాల్ రెడ్ క్రాస్ అత్యవసర బృందాలను కూడా సహాయక చర్యల్లోకి దించింది.
వరద పరిస్థితిపై హోం మంత్రిత్వ శాఖ అత్యవసర సమావేశం నిర్వహించగా, ప్రధానమంత్రి బాలేంద్ర షా సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ముందస్తు జాగ్రత్తగా 5 జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించి, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.







