శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 878 అడుగులకు పైగా ఉన్నప్పటికీ, కేసీ కెనాల్ ఆయకట్టు రైతులకు సాగునీరు విడుదల కాకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఒకవైపు విద్యుత్ ఉత్పత్తి కోసం భారీగా నీటిని తరలిస్తుండగా, రాయలసీమ రైతులకు వారి న్యాయమైన వాటా అందడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ పరిస్థితిపై ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత వివాదానికి దారితీశాయి. కేసీ కెనాల్ రైతులు సాగునీటిపై ఆశలు పెట్టుకోవద్దని, వరి పంటలకు బదులుగా ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని ఆయన సూచించడం రైతుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది.
గత ప్రభుత్వాల హయాంలో శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం తక్కువగా ఉన్నప్పటికీ కేసీ కెనాల్కు సాగునీరు విడుదల చేశారని రైతులు గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో సమృద్ధిగా నీరు ఉన్నా విడుదల చేయకపోవడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు.
సాగునీటి కోసం నందికొట్కూర్ పరిధిలోని రైతులు, రైతు సంఘాల నాయకులు హంద్రీ-నీవా కాలువలోకి దిగి మెడలో ఉరితాళ్లు వేసుకుని వినూత్న నిరసన చేపట్టారు. తమ పంటలను కాపాడాలని, వెంటనే కేసీ కెనాల్కు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 30లోపు సాగునీరు విడుదల చేయకపోతే వేలాది మంది రైతులతో హంద్రీ-నీవా ప్రాజెక్టును ముట్టడిస్తామని హెచ్చరించారు.







