అనంతపురం (Anantapuram) జిల్లా తాడిపత్రిలో (Tadipatri) రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. తాడిపత్రి వైఎస్సార్సీపీ(YSRCP) సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని (Kethireddy Peddareddy) పోలీసులు హౌస్ అరెస్ట్ (House Arrest) చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం “చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు” కార్యక్రమం నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా.. మరోవైపు టీడీపీ(TDP) నేత జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) బైక్ ర్యాలీ చేపట్టడం రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది.
వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం నిరసన కార్యక్రమానికి హాజరయ్యేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి బయలుదేరగా తాడిపత్రి పోలీసులు(Police) ఆయనను అడ్డుకున్నారు. కార్యక్రమానికి అనుమతి లేదని చెబుతూ ఇంటి వద్దే నిలిపివేశారు. అనంతరం ఆయనను హౌస్ అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. ఈ సమయంలో పోలీసుల తీరుపై కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతోనే తనను బయటకు రానివ్వడం లేదని ఆరోపించారు.
ఇక కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకోవడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు (YSRCP Party Workers) పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులతో కార్యకర్తలకు వాగ్వాదం చోటుచేసుకోగా.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొంతసేపు తోపులాట కూడా జరిగింది. దీంతో అక్కడ భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
అయితే తాడిపత్రి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పర్యటనలకు ఇప్పటికే హైకోర్టు (High Court) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ పోలీసులు ఆయనను అడ్డుకోవడంపై వైఎస్సార్సీపీ నేతలు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.
మరోవైపు పోలీసులు టీడీపీ నేతలకు వత్తాసు పలుకుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ ఒత్తిళ్లతోనే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకున్నారంటూ వైఎస్సార్సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. తాడిపత్రిలో తాజా పరిణామాలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.






