రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సంపూర్ణంగా అమలు చేయడంలో విఫలమైందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించిన ఆయన, ఈ రెండేళ్ల పాలన రాష్ట్రానికి మరియు ప్రజలకు వెన్నుపోటుగా మారిందని ఆరోపించారు.
జగన్ ప్రకారం, ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్-6, సూపర్-7తో పాటు మొత్తం 143 హామీలను బాండ్ల రూపంలో ప్రజలకు అందించినప్పటికీ, వాటిలో ఏ ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రజలు “ఆ హామీలు ఏమయ్యాయి?” అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని అన్నారు.
రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, చివరకు ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభుత్వం మోసం చేసిందని ఆయన ఆరోపించారు. ఎన్నికల ముందు చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనులకు ఎలాంటి పొంతన లేదని, పాలన మొత్తం మోసాలు, దగా, స్కాంలతో నిండిపోయిందని విమర్శించారు.
ఈ రెండేళ్లలో రాష్ట్రం అభివృద్ధిని కాకుండా అబద్ధాల ప్రచారాన్ని మాత్రమే చూసిందని, సంక్షేమం స్థానంలో మోసాన్ని, ప్రజాపాలన స్థానంలో రాజకీయ కక్షసాధింపులు, వివక్ష, అరాచకాలు, రెడ్బుక్ రాజ్యాంగాన్ని ఎదుర్కొంటోందని జగన్ వ్యాఖ్యానించారు.
మహిళలు, చిన్నారులకు రక్షణ లేకుండా పోయిందని, పోలీసు సహా అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టాయని, శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆరోపించారు. రాష్ట్రాన్ని జంగిల్రాజ్లా నడుపుతున్నారని, ప్రజలపైనే కక్షసాధింపు రాజకీయాలు కొనసాగుతున్నాయని విమర్శించారు.
అమరావతి నిర్మాణం పేరుతో భారీ అవినీతి జరుగుతోందని, ఇసుక, మట్టి, లిక్కర్, క్వార్ట్జ్, లేటరైట్ రంగాల్లో మాఫియాలు రాజ్యమేలుతున్నాయని ఆరోపించారు. మరోవైపు కరెంట్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ వ్యాట్లు, బస్సు ఛార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు, పన్నులు పెరగడంతో ప్రజలపై ఆర్థిక భారం రోజురోజుకూ పెరుగుతోందని తెలిపారు.
విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని జగన్ విమర్శించారు. డీఎస్సీ నిర్వహణలో అక్రమాలు, అవకతవకలు జరిగాయని, ప్రచార కార్యక్రమాలకు మాత్రం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో ప్రతి వర్గం అసంతృప్తితో ఉందని, ప్రతి కుటుంబం తాము మోసపోయామని భావిస్తోందని జగన్ పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీలు ప్రజల ఆవేదనకు, ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతకు ప్రతీకగా నిలిచాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పోరాటంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, యువత, ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు.
చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలు ప్రతి హామీని గుర్తుంచుకున్నారని, ప్రతి మోసాన్ని లెక్కపెడుతున్నారని జగన్ హెచ్చరించారు. “నారాసుర పాలన”కు వ్యతిరేకంగా ప్రజల తరఫున తమ పోరాటం కొనసాగుతుందని, స్కాంలు, అన్యాయాలను ప్రశ్నిస్తూ ప్రజల గొంతుకగా నిలబడతామని స్పష్టం చేశారు.






