నేపాల్లో (Nepal) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుని 8 మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన కలకలం రేపింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు(Bus) అదుపుతప్పి దాదాపు 200 మీటర్ల లోతైన లోయలో (Valley) పడిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటన నేపాల్లోని కావ్రేపలాంచోక్ జిల్లాలో (Kavrepalanchok District) జరిగింది. మొత్తం 24 మంది ప్రయాణికులతో కొండ ప్రాంత రహదారిపై ప్రయాణిస్తున్న బస్సు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా (Dead), పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానిక పోలీసుల వివరాల ప్రకారం బనేపా నుంచి రోషి గ్రామీణ మున్సిపాలిటీకి (Roshi Rural Municipality) వెళ్తున్న బస్సు బి.పి. హైవేపై (B.P. Highway) నమోబుద్ధ మున్సిపాలిటీ-2 పరిధిలోని బుచ్చాకోట్ సమీపంలో ప్రమాదానికి గురైంది. సమాచారం అందుకున్న వెంటనే నేపాల్ ఆర్మీ, సాయుధ పోలీసు బృందాలు, స్థానికులు కలిసి సహాయక చర్యలు చేపట్టారు.
లోయలో పడిపోయిన బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసి ధులిఖెల్ ఆసుపత్రికి (Dhulikhel Hospital) తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ప్రాథమిక విచారణలో స్టీరింగ్ (Steering) సరిగా పనిచేయకపోవడం లేదా టైర్ పేలిపోవడం వల్ల డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ ప్రమాదంపై నేపాల్ ప్రధాన మంత్రి కార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించింది.








