ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసన సభ్యుల అవినీతి, అక్రమాలు, అరాచకాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై విచ్చలవిడిగా కేసులు నమోదు చేస్తూ ప్రతిపక్ష గొంతును అణిచివేస్తున్నారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విమర్శలు ప్రతిపక్షానికే పరిమితం కాకుండా, కూటమి పార్టీలకు చెందిన సొంత నాయకులు, కార్యకర్తలు, బంధువులపై కూడా వేధింపులు జరుగుతున్నాయనే అభిప్రాయం ప్రజల్లో బలపడుతోంది.
ఒకవైపు ప్రతిపక్ష నేతలపై దాడులు, మరోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేల అవినీతిని లేదా వ్యవహారశైలిని ప్రశ్నించిన వారిపైనే కేసులు నమోదు చేయడం ద్వారా రాష్ట్రంలో భయోత్పాత వాతావరణాన్ని సృష్టిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సామాన్య ప్రజలు కూడా వెనుకంజ వేయాల్సిన పరిస్థితిని కూటమి నాయకత్వం తీసుకొచ్చిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై అక్రమాల ఆరోపణలు చేసిన అదే పార్టీకి చెందిన న్యాయవాది ఈడుపుగంటి శ్రీనివాస్ బాబుపై కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది. అలాగే మంత్రి గుమ్మడి సంధ్యారాణి అనధికార పీఏ సతీష్పై నమోదైన అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో బాధితురాలికి అండగా నిలిచారని మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు ఆర్పీ భంజ్దేవ్ నివాసానికి పోలీసులు వెళ్లి విచారణ జరపడం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని సోషల్ మీడియాలో పోస్టు చేసిన మాజీ ఎంపీ కేశినేని నానిపై కేసు నమోదు చేయడం, రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తూ న్యాయం కోరిన మహిళపైనే కేసు నమోదైందనే విమర్శలు, గుంటూరులో టీడీపీ ఎమ్మెల్యే నజీర్కు సంబంధించిన వివాదంలో పార్టీ మహిళా కార్యకర్త సూఫియాపై పోలీసు వేధింపులు జరిగాయని వచ్చిన ఆరోపణలు కూడా ఇదే చర్చకు బలం చేకూరుస్తున్నాయి.
పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై జనసేన కార్యకర్త పూనెం వంశీ విడుదల చేసిన సెల్ఫీ వీడియోలో తన సమస్యను పరిష్కరించాల్సిందిపోయి తనపై కేసులు పెట్టించి జైలుకు పంపించాలని ప్రయత్నించారని ఆరోపించడం కూడా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
ఇలా తెలుగుదేశం, జనసేనకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు తమ అవినీతి లేదా వ్యవహారశైలిని ప్రశ్నించిన సొంత పార్టీ కార్యకర్తలపైనే కేసులు పెట్టించి వేధింపులకు పాల్పడుతున్నారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ నేత అబయ్య చౌదరి గతంలో చేసిన “రెడ్ బుక్ రాజ్యాంగం చివరికి టీడీపీ నేతల గుమ్మాలకే చేరుతుంది” అన్న వ్యాఖ్యలు ఇప్పుడు నిజమవుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
శాసన సభ్యులను ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేసే ధోరణికి ‘రెడ్ బుక్ రాజకీయాలే’ కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వేధింపుల రాజకీయాలు కొనసాగితే భవిష్యత్తులో కూటమికే రాజకీయంగా నష్టం కలిగించే ప్రమాదం ఉందని, ఆందోళన వ్యక్తం చేస్తున్న వారు అధికార పార్టీలోనే ఉన్నారనే చర్చ కూడా సాగుతోంది.






