సరికొత్త ప్రయోగాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన సింగ్ గీతం ప్రస్తుతం థియేటర్లలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్పై క్రియేటివ్ డైరెక్టర్ నాగశ్విన్ ఆధ్వర్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని వీక్షించిన జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ రివ్యూ ఇచ్చి చిత్ర బృందాన్ని అభినందించారు. సినిమా తన హృదయాన్ని లోతుగా తాకిందని తారక్ పేర్కొనడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
94 ఏళ్ల వయసులో కూడా సింగీతం శ్రీనివాసరావు తన సృజనాత్మకతను అదే స్థాయిలో కొనసాగించడం ఎంతో గొప్ప విషయమని ఎన్టీఆర్ కొనియాడారు. “సింగ్ గీతం నా మనసును బలంగా తాకిన అందమైన చిత్రం. ఈ వయసులో కూడా సింగీతం గారు తన అనుభవాన్ని, ఆలోచనలను ప్రేక్షకులతో పంచుకోవడం నాలాంటి ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది” అంటూ తారక్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఈ చిత్రానికి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ పనితీరుపై కూడా ఎన్టీఆర్ ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. ప్రతి సన్నివేశాన్ని తన సంగీతంతో మరో స్థాయికి తీసుకెళ్లారని, సినిమాలో అద్భుతమైన భావోద్వేగాన్ని సృష్టించారని తెలిపారు. దేవిశ్రీ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందని సినీ అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు.
దర్శకుడు నాగశ్విన్పై కూడా తారక్ ప్రశంసలు గుప్పించారు. సింగీతం శ్రీనివాసరావు 40 ఏళ్ల క్రితం కలగా భావించిన కథను ఈరోజు వెండితెరపై ఆవిష్కరించడం నిజంగా గొప్ప విషయమని పేర్కొన్నారు. సింగీతం గారికి నాగశ్విన్, వైజయంతీ మూవీస్ అందించిన ఈ ట్రిబ్యూట్ ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. మొత్తం చిత్ర యూనిట్కు అభినందనలు తెలిపారు.
#SingGeetham is a beautiful film that touched my heart. Legendary Singeetham Srinivasarao garu at 94 delivering creativity and wisdom like only he can is deeply inspiring to witness.https://t.co/V3I1C0jAth @ThisIsDSP, you nailed it throughout! You brought magic to every…
— Jr NTR (@tarak9999) June 15, 2026
సింగీతం శ్రీనివాసరావు సినిమాలు ఎప్పుడూ వినూత్న ఆలోచనలకు ప్రతీకగా నిలుస్తుంటాయి. అదే శైలిని కొనసాగిస్తూ సినిమా విడుదలైన తర్వాత అధికారిక ట్రైలర్ను రిలీజ్ చేయడం టాలీవుడ్లోనే ఒక కొత్త ప్రయోగంగా మారింది. ఈ ట్రైలర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు ఎన్టీఆర్ తెలిపారు. ఈ హార్ట్ టచింగ్ మూవీని ప్రతి ఒక్కరూ థియేటర్లలో చూసి ఆస్వాదించాలని అభిమానులకు తారక్ పిలుపునిచ్చారు.






