ప్రముఖ టెలివిజన్ నటి సంచితా ఉగలే (22) అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం టీవీ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది. మహారాష్ట్రలోని నలసోపారాలో ఉన్న తన నివాసంలో ఆమె మృతదేహం లభ్యమైంది. ఇటీవల తెలుగు నటి ట్విషా శర్మ మరణం విషాదాన్ని మరువక ముందే మరో యువ నటి ఆకస్మికంగా చనిపోవడంతో సినీ, టెలివిజన్ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.
ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 7:30 గంటల మధ్య ఈ ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. సంచితా తండ్రి మచింద్ర ఉగలే ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సంచితా ఉగలే టెలివిజన్ రంగంలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఎన్నో ఏళ్లుగా ప్రసారం అవుతున్న కుంకుమ్ భాగ్య సీరియల్లో దియా టాండన్ పాత్ర ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ సీరియల్ తన కెరీర్కు మంచి బ్రేక్ ఇచ్చిందని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆమె చెప్పింది. ఇంతలోనే ఆమె అకాల మరణం చెందడంతో సహనటులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అలాగే విక్కీ కౌశల్ నటించిన చావా చిత్రంలో కూడా చిన్న పాత్రలో కనిపించింది.
అచోలే పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ వినోద్ బాగ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. సంచితా తన పడకగదిలో తాళం వేసుకుని చీరతో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆమెను వసాయి-విరార్ మున్సిపల్ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు మరణించినట్లు ప్రకటించారు.
ప్రస్తుతం పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం కోసం తరలించారు. నివేదిక వచ్చిన తర్వాతే అసలు కారణం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరణానికి దారితీసిన పరిస్థితులపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.






