నీట్ పరీక్షల పేపర్ లీకేజీ వ్యవహారం, దేశంలో రోజురోజుకు పెరుగుతున్న నిరుద్యోగ సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ రాజస్థాన్ రాజధాని జైపూర్లో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ ఆందోళనలు జరిగాయి. షహీద్ స్మారక్ వద్ద నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమానికి పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నాయకత్వం వహించారు. నిరసనల్లో పెద్ద సంఖ్యలో యువత, విద్యార్థులు పాల్గొని ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడికి వచ్చిన కొందరు గుర్తుతెలియని దుండగులు అభిజీత్ దీప్కేపై ఆకస్మికంగా దాడికి పాల్పడ్డారు. ఆయన ముఖంపై చంపెదెబ్బలు కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఏమి జరుగుతుందో అర్థం చేసుకునేలోపే దాడి చేసిన వ్యక్తులు అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.
ఈ ఘటనతో నిరసన ప్రాంగణంలో కొంతసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ కార్యకర్తలు వెంటనే అభిజీత్ దీప్కేను సురక్షిత ప్రాంతానికి తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా గత నెలలో కూడా అభిజీత్ దీప్కేకు వాట్సాప్ ద్వారా గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ప్రాణహాని బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఆయన సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేయడానికి కూడా కొందరు ప్రయత్నించినట్లు సమాచారం బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో జైపూర్ నిరసనలకు భారీ భద్రత ఏర్పాటు చేసినప్పటికీ దుండగులు దాడికి పాల్పడటం చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.







