మహారాష్ట్రలోని (Maharashtra) పర్భణి జిల్లాలో (Parbhani District) శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మానవత్ తహసీల్ (Manwath Tehsil) పరిధిలో ఉన్న ప్రసిద్ధ యశ్వడి మారుతి హనుమాన్ ఆలయంలో (Yashwadi Maruti Hanuman Temple) జరిగిన ప్రమాదం భక్తులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆలయం ముందు నిర్మించిన సభా మండపం (Assembly Hall) ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడ ఉన్న భక్తులు (Devotees) శిథిలాల కింద చిక్కుకున్నారు. ఈ ఘటనలో ప్రాథమిక సమాచారం ప్రకారం 6 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
శనివారం కావడంతో హనుమాన్ ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయంలో మతపరమైన కార్యక్రమాలు(Religious Programs), కీర్తనలు (Devotional Songs) జరుగుతున్న సమయంలో సభా మండపంలో వందలాది మంది భక్తులు ఉన్నారు. అకస్మాత్తుగా పైకప్పు కూలిపోవడంతో అక్కడ తీవ్ర కలకలం నెలకొంది. సుమారు 30 నుంచి 40 మంది వరకు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం, పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. శిథిలాలను తొలగిస్తూ చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించేందుకు అంబులెన్సులను కూడా సిద్ధంగా ఉంచారు.
ఘటనా స్థలం నుంచి బయటకు వచ్చిన ఫోటోలు, వీడియోలను పరిశీలిస్తే సభా మండప నిర్మాణ పనులు పూర్తిగా ముగియలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిర్మాణంలో ఏవైనా లోపాలు ఉన్నాయా లేదా ఇతర కారణాలతో ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పూర్తిగా బ్లాక్ చేసి సహాయక చర్యలను వేగవంతం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, ప్రమాదానికి గల అసలు కారణాలను సమగ్ర విచారణ అనంతరం వెల్లడిస్తామని జిల్లా అధికారులు తెలిపారు. శనివారం ప్రత్యేక పూజల సందర్భంగా భారీగా భక్తులు ఆలయానికి రావడం వల్ల ప్రాణనష్టం మరింత పెరిగిందని అధికారులు వెల్లడించారు.








