ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలోని ఉండవల్లి గ్రామంలో భూసేకరణ వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రాజధానికి అవసరానికి మించి భూములు ఎందుకు తీసుకుంటున్నారంటూ ప్రశ్నించిన రైతులకు సమాధానం ఇవ్వకుండా, వారు సాగు చేసిన పంటలను జేసీబీలతో దున్నిస్తూ ధ్వంసం చేస్తున్నారంటూ రైతులు ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
సీఆర్డీఏ అధికారులు భూముల్లోకి ప్రవేశించి పంటలను ధ్వంసం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన రైతులను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారని ఆరోపిస్తున్నారు. మహిళా రైతులు ఉన్నారని కూడా చూడకుండా లాగిపడేశారని, తమతో అమానుషంగా వ్యవహరించారని వారు వాపోతున్నారు.
తాము కష్టపడి పండించిన పచ్చని పంటలను నాశనం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “మా పంటలను ధ్వంసం చేయడం కన్నా మమ్మల్ని చంపేయండి” అంటూ మహిళా రైతులు ప్రభుత్వ తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
ఉండవల్లి ఘటనతో రాజధాని ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భూసేకరణ, పంటల ధ్వంసం, పోలీసుల చర్యలపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన కొనసాగిస్తున్నారు.





