బహమాస్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశం 53వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో ఆనందోత్సవాలు ఒక్కసారిగా శోకసంద్రంగా మారాయి. రాజధాని నసావుకు పశ్చిమాన ఉన్న నార్త్ ఆండ్రోస్ ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది.
ప్రమాదానికి గురైనది ఫ్లెమింగో ఎయిర్లైన్స్కు చెందిన సెస్నా 402 విమానం. ఈ విమానం నసావులోని లిండెన్ పిండ్లింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శాన్ ఆండ్రోస్కు బయలుదేరింది. ప్రయాణం మధ్యలో సాంకేతిక లోపం తలెత్తినట్లు గుర్తించిన పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులకు సమాచారం అందించినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రాథమిక వివరాల ప్రకారం విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికులు దిగుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే భారీ పేలుడు సంభవించడంతో విమానంలో ఉన్న వారంతా మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఒక వ్యక్తిని సజీవంగా బయటకు తీసినప్పటికీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కూడా ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.
ప్రమాదానికి గల అసలు కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు అధికారులు విమానం బ్లాక్ బాక్స్ను స్వాధీనం చేసుకున్నారు. దాని విశ్లేషణ పూర్తైన తర్వాత ప్రమాదానికి దారితీసిన కారణాలపై పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఈ ఘటన అనంతరం ఫ్లెమింగో ఎయిర్లైన్స్ తమ అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టాలని సంస్థ ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులకు ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు నివేదిక వచ్చే వరకు అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నట్లు తెలిపింది.
విమాన ప్రమాదంపై బహమాస్ ప్రధానమంత్రి ఫిలిప్ బ్రేవ్ డేవిస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సమయంలో ఇలాంటి విషాదం చోటుచేసుకోవడం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఘటన నేపథ్యంలో ప్రభుత్వ అధికారిక స్వాతంత్ర్య వేడుకలను రద్దు చేసినట్లు ప్రకటించారు.
మృతుల కుటుంబ సభ్యులకు ముందుగా సమాచారం అందించిన తర్వాతే వారి వివరాలను అధికారికంగా వెల్లడిస్తామని బహమాస్ ప్రభుత్వం తెలిపింది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు దర్యాప్తు పూర్తైన అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.








