ఇండోనేషియాలోని (Indonesia) మదురా దీవి (Madura Island) సమీపంలో ఆదివారం భారీ సముద్ర ప్రమాదం (Sea Accident) చోటుచేసుకుంది. మొత్తం 271 మంది ప్రయాణికులు, సిబ్బందితో ప్రయాణిస్తున్న ఓ ఫెర్రీలో (Ferry) అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో 5 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 41 మంది గల్లంతైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.
అంతర్జాతీయ మీడియా (International Media) కథనాల ప్రకారం.. తూర్పు జావాలోని సురబయా (Surabaya) నుంచి దక్షిణ సులవేసిలోని మకాస్సార్కు (Makassar) బయల్దేరిన ఫెర్రీలో ఉదయం ఈ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించాయి.
ఇప్పటివరకు 225 మందిని సురక్షితంగా రక్షించినట్లు అధికారులు తెలిపారు. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో ప్రాణాలు దక్కించుకునేందుకు ప్రయాణికులు ఫెర్రీ పైభాగానికి పరుగులు తీసిన దృశ్యాలు కలవరానికి గురిచేశాయి.
ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు. గల్లంతైన 41 మంది కోసం సముద్రంలో గాలింపు చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి.








